మెగా మూవీ షురూ!

3 Feb, 2017 06:32 IST|Sakshi
మెగా మూవీ షురూ!

అన్న చిరంజీవి–తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదిక మీద కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక, ఒకే సినిమాలో కనిపిస్తే వాళ్లు పరమానందపడిపోతారు. చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లో ‘నా పేరే కాంచనమాల..’ పాటలో పవన్‌ కల్యాణ్‌ కాసేపు కనిపిస్తేనే, హ్యాపీ ఫీలయ్యారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఆ టైమ్‌ వచ్చే సింది. చిరు–పవన్‌ కాంబినేషన్‌లో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఓ భారీ చిత్రం నిర్మించనున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని గురువారం టీయస్సార్‌ అధికారికంగా ప్రకటించారు. మరిన్ని విశేషాలను టీయస్సార్‌ చెబుతూ– ‘‘చిరంజీవిగారి కమ్‌ బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’ చూశాక మళ్లీ సినిమాలు నిర్మించాలనిపించింది. ఇటీవల ఈ చిత్రబృందాన్ని సన్మానించి నప్పుడు చిరంజీవి–పవన్‌ కాంబినేషన్‌లో సినిమా తీస్తానని చెప్పాను. ఆ తర్వాత ఇద్దర్నీ ప్రత్యేకంగా కలసి డిస్కస్‌ చేశాను. నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్‌ బెస్ట్‌ అనుకున్నాను. అతనితో కూడా మాట్లాడాను.

ఈ చిత్రాన్ని గ్రేట్‌ ప్రొడ్యూసర్‌ సి. అశ్వినీదత్‌తో కలసి నిర్మించబోతున్నా’’ అని చెప్పారు. గతంలో శోభన్‌ బాబుతో ‘జీవన పోరాటం’, చిరంజీవితో ‘స్టేట్‌ రౌడీ, రాజశేఖర్‌తో  ‘గ్యాంగ్‌మాస్టర్‌’తో పాటు సంస్కృత సినిమా ‘భగవద్గీత’, పలు హిందీ చిత్రాలు నిర్మించారు టీయస్సార్‌. చాలా గ్యాప్‌ తర్వాత నిర్మాతగా ఈ మెగా మూవీ చేయనున్నారు.