పవన్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

27 Dec, 2016 02:19 IST|Sakshi
పవన్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

నటిని కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. అందులోనూ సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏ విషయమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. అలాంటి వారి ప్రతిచర్యను సాధారణ ప్రజలు గమనిస్తుంటారన్నది గుర్తెరగాలి. నటి నికిషాపటేల్‌ ఇలాంటి విషయాలేవీ పట్టించుకున్నట్లు లేదు. ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లోకెక్కి ప్రచారం పొందాలన్న తాపత్రయంతో, స్వప్రయోజనం కోసం తహతహలాడుతున్నట్లుంది ఆమె వాలకం చూస్తుంటే. ఇంతకీ నికిషాపటేల్‌ ఏమందనేగా మీ ఆసక్తి. అదేమిటో చూద్దాం.ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగిన గుజరాతీ అమ్మాయి నికిషాపటేల్‌. బాలీవుడ్‌లో నాయకి కావాలన్న ఆశతో వచ్చి టాలీవుడ్‌లో కొమరం పులి చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసింది. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో కోలీవుడ్‌కు మకాం మార్చింది. ఇక్కడ కొన్ని చిత్రాలలో నటించినా తగిన గుర్తింపు కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ప్రస్తుతం నటుడు శక్తికి జంటగా 7 నాట్కళ్‌ అనే చిత్రంలో నటిస్తోంది.

ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ బాలీవుడ్‌లో హీరోయిన్‌ కావాలని ఆశించిన తనను దర్శకుడు ఎస్‌జే.సూర్య ఒత్తిడి చేసి మరీ టాలీవుడ్‌లో పవన్‌కల్యాణ్‌కు జంటగా కొమరం పులి చిత్రంతో పరిచయం చేశారని చెప్పింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించక పోవడంతో తనకు కొత్తగా అవకాశాలు రాలేదంది. అలా చాలా ఏళ్లే ఎదురు చూసిన తరువాత ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. చాలా మంది పెళ్లి గురించి అడుగుతున్నారనీ, ఆడమగ కలిసి జీవించడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంది. నా వరకూ వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పింది.

నేనెవరినైనా ఇష్టపడితే అతనితో పెళ్లి చేసుకోకుండానే కలిసి సహజీవనం చేస్తానంది. ఇంకా చెప్పాలంటే 2030 తరువాత దేశంలోనే ఈ వివాహ సంప్రదాయమే ఉండదని అంది. ఆడామగా కలిసి జీవించే సంస్కృతే ఉంటుందని, అది మనం చూడబోతున్నాం అని పేర్కొంది. అయినా పెళ్లి చేసుకున్న వారందరూ కలిసే జీవిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. తాను ఒక సారి ప్రేమలో ఓడి పోయానని, అప్పట్లో అందమైన అబ్బాయిలకు ప్రాధాన్యం ఇచ్చానని చెప్పింది. ఇప్పుడు అందాన్ని మించి విషయాన్ని చూసే పరిపక్వత పొందానని చెప్పుకొచ్చింది.