రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

7 Apr, 2020 19:59 IST|Sakshi

సాక్షి,చెన్నై: శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు..  సమాజం నుంచి  తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైనా కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. ఇందుకోసం టాలీవుడ్ సినీ నటులు కరోనా క్రైసెస్ ఛారిటీని ఏర్పాటు చేసి తమ వంతు సాయాన్ని  అందిస్తున్నారు. ఇంకోవైపు తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు. తాజాగా తమిళ అగ్ర నటుడు అజిత్.. తన వంతుగా రూ. 1 కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అందులో ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి  25 లక్షల రూపాయ‌ల విరాళాన్ని  ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. అజిత్ త‌న త‌దుప‌రి చిత్రం వాలిమై చిత్రీక‌ర‌ణ క‌రోనా కార‌ణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను  బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు