కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

29 Mar, 2020 09:02 IST|Sakshi

లాక్‌డౌన్‌..నగరవాసిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడూ దొరకని ఇంత తీరిక ఇప్పుడు లభించడంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమకు ఇష్టమైన పనులు చేస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సినీ, టీవీ నటులు అందరూ ఇలా లాక్‌డౌన్‌ టైంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఆయన మాటల్లో మీరే వినండి. (న్యూ కట్)

నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్‌ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్‌ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్‌.. అందుకే ఎక్కువగా చేస్తున్నాను. ‘వద్దండి.. నాకు బోర్‌ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా, వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి, (టమోటాలు కొనే పని కూడా లేదు.. ఇంట్లోనే చెట్లు ఉన్నాయి.. కోయడం చేయడమే). (లాక్డౌన్: విరుష్కలు ఏం చేస్తున్నారో చూశారా?)

ఈ విధంగా వంటిల్లుని నేను స్వాధీనపరచుకున్నా.. ఇప్పుడు యోధుణ్ణి నేను. ‘అదేంటండి? అంటుంది’ మా ఆవిడ. పనీ పాటా లేదు. ఏదో ఒక పని చేయకపోతే తిన్నది అరగదు అన్నాను. ‘అయితే పనిమనిషి రాలేదు.. బయట ఊడవండి’ అంది. నేను ఊడవను అన్నాను. సరే.. కారు కడగండి అంది. నన్ను డామినేట్‌ చేసి మా అబ్బాయి బాలాజీ  అప్పటికే కారు కడిగేస్తున్నాడు.. సో.. నాకు వంట పని ఒక్కటే కనిపించింది.. చేస్తున్నా. చూడండి మగాళ్లలారా. పని లేదు.. పని లేదు అని ఏడవడం కాదు. నీకు వచ్చిన పనిని సిగ్గు లేకుండా, మొహమాట పడకుండా చేయాలి. నా వ్యక్తిగత అనుభూతి ఏంటంటే వంట చేసేటప్పుడు చాలా రిలాక్స్‌ అయిపోతున్నాను.. ఆ సమయంలో నా ఒత్తిడి అంతా తగ్గిపోతోంది. –  రాజేంద్రప్రసాద్‌   

వంటింట్లో అమ్మకు సాయం చేస్తూ... 
ఈ ఖాళీ సమయంలో వంటింట్లో అమ్మకు సాయం చేస్తున్నా. శనివారం బెండకాయ వేపుడు చేశా.  కనీసం ఈ మూడు వారాలైనా తన తల్లికి సహాయ పడాలని ఆమెపై కొంత పనిభారం తప్పించాలనే ఉద్దేశంతోనే వంటలకు శ్రీకారం చుట్టా. అంతేకాదు ఈ రోజు ఇల్లు కూడా శుభ్రం చేశా. మీరంతా కనీసం ఈ 21 రోజులైనా ఇళ్ళల్లో ఉండి తల్లికి ఇంటి పనుల్లో సాయపడండి.  – ప్రదీప్, యాంకర్‌   (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాటకే ఇప్పుడు క్రేజ్)

మరిన్ని వార్తలు