కరోనా క్రైసిస్‌: ఉదారతను చాటుకున్న శివాని, శివాత్మిక

4 Apr, 2020 17:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేయడంతో పాటు షూటింగ్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కార్మికులకు పనిలేకుండా పోయింది. రెక్కాడితేగాని డొక్కాడని పేద సిని కార్మికుల కోసం టాలీవుడ్‌ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో  సి. సి. సి. మనకోసం (కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం) ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో సిసిసికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చెరో కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరిని చూసి మిగతా నటులు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటీనటులు జీవితా రాజశేఖర్‌ల ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మికలు పేద కార్మికుల కోసం తమ వంతుగా సాయం ప్రకటించారు. 

సిసిసికి శివాపి, శివాత్మికలు చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు జీవితా రాజశేఖర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇప్పటికే రాజశేఖర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించాము. ఈ కార్యక్రమం కరోనా క్రైసిస్‌ ఉన్నంతవరకు సాగుతుంది. అయితే పేద సినీ కార్మికుల కోసం ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీలో మా కుటుంబం కూడా భాగం అయింది. మా ఇద్దరు కుమార్తెలు శివాణి, శివాత్మికలు తమ సంపాదన నుంచి చెరో లక్ష రూపాయాలు విరాళంగా ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి, కష్టాల్లో ఉన్న పేద కార్మికులకు సహాయం అందించడంలో మా కుటుంబం సహాయం ఎప్పుడూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల పంపిణీలో మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అంటూ జీవితా రాజశేఖర్‌ పేర్కొన్నారు.

చదవండి:
ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌
పెద్ద మనసు చాటుకున్న నయనతార

మరిన్ని వార్తలు