ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

8 Apr, 2020 17:22 IST|Sakshi
ఫైల్ ఫోటో

కరీం మొరానీకి కరోనా పాజిటివ్ 

కుమార్తెల ద్వారా వైరస్ సోకినట్టు అనుమానం

హోం  క్వారంటైన్ లో కరీం భార్య, ఇతరులు

సాక్షి, ముంబై : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ కరోనా వైరస్ బారిన పడ్డారు. త‌న‌ ఇద్ద‌రు కుమార్తెలకు క‌రోనా పాజిటివ్ తేలిన అనంత‌రం తాజాగా ఈయనకు ఈ వైరస్ సోకింది. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ తేలడంతో చికిత్స నిమిత్తం ఆయనను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారని కరీం సోదరుడు వెల్లడించారు. అయితే అన్న కరీం భార్యతోపాటు ఇంట్లోని ఇతర సిబ్బందికి నెగిటివ్ వచ్చిందనని కరీం సోదరుడు మొహమ్మద్ మొరానీ పిటిఐకి చెప్పారు. వారు  హోం క్వారంటైన్ లో ఉన్నట్టు  తెలిపారు. అలాగే  ఆయన కుమార్తెలు షాజా, జోయా ఇద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారన్నారు.

కరోనా వైరస్ సోకిన కుమార్తెల నుంచే మొరానీకి కూడా సోకినట్టుగా భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో శ్రీలంక నుండి తిరిగి వచ్చిన షాజా మొరానీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ పాజిటివ్ వచ్చింది.  ఈమె ముంబైలోని షాజా నానావతి ఆసుపత్రిలోనే  చికిత్సపొందుతున్నారు.  ఆ తరువాత రాజస్థాన్ నుండి తిరిగి వచ్చిన  నటి జోయాకు కొన్ని లక్షణాలు కనిపించినా, మొదట నెగిటివ్ వచ్చింది, ఆ తరువాత మరోసారి నిర్వహించిన పరీక్షల పాజిటివ్ వచ్చింది. ఈమెను కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలోచేర్పించారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో  చికిత్స  పొందుతున్నారు.  

కాగా "రా వన్", "చెన్నై ఎక్స్‌ప్రెస్", "హ్యాపీ న్యూ ఇయర్"  "దిల్‌వాలే" వంటి అనేక బాలీవుడ్ చిత్రాలకు కరీం నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్ కు సంబంధించిన గాయని కనికా కపూర్, నటుడు పురబ్ కోహ్లీ, కరీం కుమార్తె, నటి జోయా తరువాత పాజిటివ్ వచ్చిన తాజా కరోనావైరస్ కేసు ఇది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బుధవారం ఉదయం నాటికి,  కరోనా పాజిటివ్  కారణంగా మరణించిన వారి సంఖ్య 149 కు పెరిగింది. దేశంలో 5,194 కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు