లాక్‌డౌన్‌: సూపర్‌ మార్కెట్‌లో అల్లు అర్జున్‌

27 Mar, 2020 18:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా దెబ్బకు సెలబ్రిటీలు సైతం సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. కరోనాపై పోరాటంలో భాగంగా  ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సెలబ్రెటీల నుంచి సాధారణ ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే నిత్యావసర సరకుల కోసం కేటాయించిన సడలింపు సమయంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబం కోసం కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా జూబ్లీహిల్స్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లవ్స్‌ ధరించి సూపర్‌ మార్కెట్‌లో తనకు కావాల్సిన వస్తువులును కొనుక్కుని సాదాసీదాగా వెళ్లిపోయాడు. అయితే బన్ని సూపర్‌ మార్కెట్‌లో సాధారణ వ్యక్తిగా వస్తువులు కొంటున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో బన్ని సింప్లిసిటీకి అతడి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 

ఇక కరోనాపై పోరాటంలో భాగంగా అల్లు అర్జున్‌ తన వంతు సాయంగా రూ. 1.25 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కలిపి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. ‘కోవిడ్‌-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. అంతేకాకుండా మన రోజువారి జీవితాల్ని మార్చేసింది. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, మిలటరీ, పోలీసులు, ఇలా మన కోసం ఎంతగానో కష్టపడుతున్న వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. వారి స్ఫూర్తితో నా వంతుగా చిన్నపాటి సాయం చేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలకు రూ. 1.25 కోట్లు విరాళంగా ఇస్తున్నాను. చేతులను తరుచు కడుక్కోవడం, స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారా మనం కరోనా వ్యాప్తిని నివారించవచ్చు. అతి త్వరలోనే కరోనా అంతమవ్వాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ సందర్భంగా షూటింగ్‌లు రద్దవ్వడంతో ఈ సమయాన్ని పూర్తిగా కుటుంబంతోనే గడుపుతున్నారు అల్లు అర్జున్‌. తన పిల్లలు అయాన్‌, అర్హలతో సరదాగా ఆడుకుంటూ లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. 

చదవండి:
చరణ్‌ విషయంలో అలా అనిపించింది
కరోనా: సెలబ్రిటీల ప్రతిజ్ఞ

మరిన్ని వార్తలు