హీరో మహేశ్‌ కు కోర్టు నోటీసు

6 Feb, 2017 16:52 IST|Sakshi
హీరో మహేశ్‌ కు కోర్టు నోటీసు

హైదరాబాద్: మహేశ్‌ బాబు సినిమా ‘శ్రీమంతుడు’పై వివాదం ముదురుతోంది. హీరో మహేశ్‌ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత ఎర్నేని నవీన్‌ లకు కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 3న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’  నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని శరత్‌ చంద్ర అనే నవలాకారుడు ఫస్ట్‌ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి ఇప్పటికే సమన్లు జారీ చేసింది.

ఎంబీ క్రియేషన్, మైత్రిమూవీస్‌ పతాకంపై తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ మహేశ్‌ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహేశ్‌ కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.