కాజల్‌ పిటిషన్‌ కొట్టివేతపై హైకోర్టు స్టే

12 Oct, 2017 06:20 IST|Sakshi

తమిళసినిమా: నటి కాజల్‌అగర్వాల్‌ పిటిషన్‌ కొట్టివేతపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కాజల్‌అగర్వాల్‌ చెన్నైకి చెందిన వాణిజ్య సంస్థ వీవీడీ అండ్‌ సన్స్‌ ప్రొడెక్ట్‌ వీవీడీ కొబ్బరి నూనె ప్రచార ప్రకటనలో నటించారు. అయితే ఆ ప్రకటన గడుపు ముగిసిపోయినా ప్రచారం చేసుకుంటున్నారని నటి కాజల్‌ ఆ సంస్థపై చెన్నైలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో ఆమె తనకు నష్టపరిహారంగా రూ.2.5 కోట్లను వీవీడీ అండ్‌ సన్స్‌ సంస్థ చెల్లించాలని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి టి.రవీంద్రన్‌ కాజల్‌అగర్వాల్‌ నటించిన వాణిజ్యప్రకటనపై కాపీ చట్టం ప్రకారం ఆ సంస్థకు 60 ఏళ్లు హక్కు ఉంటుందని పేర్కొంటూ కేసును కొట్టివేశారు. దీంతో కాజల్‌అగర్వాల్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం కాజల్‌ పిటిషన్‌ విచారణకు రాగా ప్రతివాదులు బదులు పిటిషన్‌ దాఖలు చేయకపోవడంతో ఈ కేసుపై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చే సింది.

మరిన్ని వార్తలు