ఓవర్‌ ది టాప్‌

16 May, 2020 00:43 IST|Sakshi

సినిమాను అధిగమిస్తుందా?

‘సృష్టిలో స్థిరమైనది మార్పు మాత్రమే’ అన్నది గ్రీకు ఫిలాసఫీ. ‘సినిమా’ రంగంలో మార్పు గమనిస్తే... మూకీ సినిమా మాటలు నేర్చుకుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్టయిలుగా రంగులేసుకుంది. రీలును చుట్టి చిప్‌లో పెట్టారు. ఇది సినిమా తయారవడంలో వచ్చిన మార్పు. సినిమా ఎన్నో సవాళ్లను చూస్తూ వస్తోంది. సినిమా మొదలయినప్పుడు నాటకం నడక వేగం తగ్గిందన్నది నిజం. ఆ తర్వాత కేబుల్‌ టీవీ వచ్చింది. బుల్లితెరకు అంటుకుపోతున్నవాళ్లను పెద్ద తెరకు తీసుకురావడం కొంచెం కష్టం అవుతోంది.

ఇప్పుడు ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) ప్లాట్‌ఫామ్స్‌ (అమేజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్, హాట్‌స్టార్, జీ5 వంటివి) వచ్చాయి. ఓవర్‌ ది టాప్‌ అంటూ దూసుకొచ్చిన ఈ మాధ్యమం సినిమా బిజినెస్‌ని అధిగమిస్తుందా? ఇప్పుడు సినిమాకు పెద్ద సవాల్‌ ఈ ఓటీటీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడే వరకే ఓటీటీ ప్రత్యామ్నాయమా? భవిష్యత్తులో థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌ను ఓటీటీ ఆపేస్తుందా? లేదంటే ఓటీటీయే భవిష్యత్తా? ఓటీటీకి అందరం అలవాటు పడాలా? ప్రస్తుతం అన్నీ ప్రశ్నలే.

ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచం స్తంభించింది. సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి. షూటింగ్‌ నుంచి విడుదల వరకూ అన్నీ బంద్‌. విడుదలకు సిద్ధమైన సినిమాలు పలు కారణాలతో ప్రత్యామ్నాయంగా ఓటీటీలో విడుదలకు సిద్ధపడ్డాయి. ఇదో సంచలనాత్మకమైన మార్పు. సినిమాను థియేటర్‌లో విడుదల చేయకుండా ఓటీటీలో విడుదల చేయడం సరికాదని పలు మల్టీప్లెక్స్‌ చైన్ల అధినేతలు, కొందరు పంపిణీదారులు, థియేటర్‌ అధినేతలు అభిప్రాయపడుతున్నారు.

థియేటరా? ఓటీటీయా?
సినిమాను థియేటర్‌లో చూడాలా? ఎవరింట్లో వాళ్లు ఓటీటీలో చూసుకోవాలా? సినిమా చూడటం అనేది ఓ కలెక్టివ్‌ ఎక్స్‌పీరియన్స్‌. థియేటర్లో ఒక రెండు వందల మంది సినిమాలోని ఒక ఎమోషన్‌ని సమానంగా ఫీలవడం. ‘సినిమాను సినిమాలాగా చూడటం థియేటర్‌లోనే జరుగుతుంది. సినిమాను థియేటర్‌లోనే అనుభూతి చెందాలి’ అని ఒక వాదన. మరోవైపు ‘ప్రతీ సినిమాను థియేటర్‌లో చూడలేం. పెరిగే టికెట్‌ రేట్లను ఫ్యామిలీ అందరం భరించలేం. ఓటీటీలో అయితే అందరూ ఇంట్లోనే వీలున్నప్పుడు చూసుకోవచ్చు. థియేటర్‌లో చూడదగ్గ సినిమా అయితే థియేటర్‌కి వస్తాం కదా?’ అనేది మరో వాదన. అభిప్రాయాలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ‘ఖచ్చితంగా ఇదే కరెక్ట్‌’ అని ఏదీ చెప్పలేం. ప్రేక్షకుడు సినిమాను థియేటర్‌లో నలుగురితో చూడాలా? ఏకాంతంగా తన ల్యాప్‌టాప్‌లోనా, టీవీలోనా? అనేది తన నిర్ణయం. ప్రస్తుతానికి మాత్రం ఏడు సినిమాలు ‘ఓటీటీ’కి రావడానికి రెడీ అయ్యాయి.

ఓటీటీకే మా ఓటు
లాక్‌డౌన్‌ వల్ల విడుదల ఆగిపోయిన పలు సినిమాలు మా ఓటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే అని డిజిటల్‌ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఆ చిత్రాల వివరాలు..

పొన్‌ మగళ్‌ వందాళ్‌: ఓటీటీలో రిలీజ్‌ అవుతున్నట్టు మొదట ప్రకటించబడిన తమిళ సినిమా జ్యోతిక నటించిన ‘పొన్‌ మగళ్‌ వందాళ్‌’. సూర్య నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్స్‌ యూనియన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్య–జ్యోతిక సినిమాలు థియేటర్స్‌లో ప్రదర్శించం అని స్టేట్‌మెంట్లు విడుదల చేశారు. అయితే మే 29 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది.

గులాబో సితాబో: అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా ముఖ్య పాత్రల్లో సూజిత్‌ సర్కార్‌ తెరకెక్కించిన హిందీ సినిమా ‘గులాబో సితాబో’. ఈ సినిమా జూన్‌ 12 నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయం గురించి అమితాబ్‌ మాట్లాడుతూ –‘‘నా కెరీర్‌లో ఎన్నో మార్పులు, సవాళ్లు చూస్తూ వచ్చాను. డిజిటల్‌ రిలీజ్‌ అనేది మరో కొత్త సవాల్‌’’ అన్నారు.

పెంగ్విన్‌: కీర్తీ సురేశ్‌ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘పెంగ్విన్‌’. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో కనిపిస్తారు కీర్తి. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ను జూన్‌ 19 నుంచి చూడొచ్చు.

కన్నడ చిత్రాలు ‘లా, ఫ్రెంచ్‌ బిర్యానీ’ జూన్‌ 26, జూలై 24వ తేదీలనుంచి లభ్యమవుతాయి. ఈ రెండు చిత్రాలకు ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ నిర్మాత.

గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా విద్యా బాలన్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన హిందీ చిత్రం ‘శకుంతలా దేవి’. జయసూర్య, అదితీరావ్‌ హైదరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘సూఫీయుమ్‌ సుజాతయుమ్‌’. ఈ రెండు చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నట్టు ప్రైమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ విడుదల తేదీలు ప్రకటించలేదు.

మార్పు మొదలైన వెంటనే భవిష్యత్తు ఇదే అని తుది నిర్ణయానికి రావడం అన్నిసార్లూ సరి కాదు. సాంకేతికత పెరిగేకొద్దీ సినిమా థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఓటీటీ కూడా థియేట్రికల్‌ బిజినెస్‌కి ఇబ్బంది అవుతుందేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా మీడియమ్‌ మారబోతోందా? సినిమాల మీద ఓటీటీ ప్రభావం చూపిస్తుందా? సమాధానాల కోసం వెతకడం కంటే వేచి చూడటమే కొన్నిసార్లు ఉత్తమమేమో?

పెద్ద తెర అనుభూతి వేరు

– ఎఫ్‌డీసీ చైర్మన్‌ పి. రామ్మోహన్‌రావు

► ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీల వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్‌ టీవీ 65 ఇంచెస్‌ ఉన్నప్పటికీ థియేటర్‌లో పెద్ద తెర మీద సినిమాను వీక్షిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ అనుభూతి వేరు. థియేటర్‌లో దాదాపు 20–40లక్షల ఖర్చుతో ఉన్న సౌండింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను వీక్షిస్తే ప్రేక్షకులకు సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంతగా కలగకపోవచ్చు.
     
► నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్మకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి సినిమా థియేట్రికల్‌ రిలీజై హిట్‌ సాధిస్తే మంచి వసూళ్లు వస్తాయి. ఈ వసూళ్ల రూపంలో వచ్చేంత డబ్బును ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ నిర్మాతలకు చెల్లించలేవు.
   
► కరోనా ప్రభావం వల్ల షూటింగ్‌లు క్యాన్సిల్‌ అయ్యాయి. భవిష్యత్‌లో థియేటర్స్‌ ఓపెన్‌ అయినప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారో? రారో? అనే భయంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్‌ కాదని నా అభిప్రాయం. నాగచైతన్యతో తీస్తున్న ‘లవ్‌స్టోరీ’కి నేను ఒక నిర్మాతను. థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ అయితే అప్పుడు మా సినిమాని రిలీజ్‌ చేస్తాం కానీ ఓటీటీలకు అమ్మాలనుకోవడం లేదు.
     
► ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉండాలి. షూటింగ్, సినిమాల విడుదల, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ వంటి విషయాలపై ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒకసారి థియేటర్స్‌ ఓపెన్‌ అయిన తర్వాత మొదటి మూడు నెలల్లో విడుదయ్యే సినిమాలకు ప్రభుత్వం ఏదైనా రాయితీ ఇవ్వాలి. జీరో ట్యాక్సేషన్, పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడం వంటి వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మల్టీప్లెక్స్‌వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. షూటింగ్‌లు మొదలుపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చని అధికారికంగా ప్రభుత్వం చెబితే, అప్పుడు తక్కువమందితో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటాం. ప్రభుత్వ స్పందన కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

నా సపోర్ట్‌ థియేటర్స్‌కే

– నిర్మాత అల్లు అరవింద్‌

     
► అమితాబ్‌ బచ్చన్‌ వంటి బిగ్‌ స్టార్‌ నటించిన సినిమా నుంచి స్టార్‌ ఆర్టిస్ట్‌లు జ్యోతిక, కీర్తీ సురేష్‌ వంటి వారు నటించిన సినిమాలు డిజిటల్‌ రిలీజ్‌కి రెడీ అయ్యాయి.. ఈ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయడం పై మీ ఒపీనియన్‌?
ఎవరైనా థియేటర్‌లో విడుదలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొందరు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా సినిమాలు విడుదల వాయిదా పడుతుండటంతో ఒకేసారి విడుదల చేస్తే థియేటర్లు దొరుకుతాయో? లేదో? పైగా అప్పులపై వడ్డీలు పెరిగిపోతుంటాయి కదా? ఈ కారణాల వల్ల డిజిటల్‌ రిలీజ్‌ బెటర్‌ అనుకునే అవకాశం ఉంది.

‘ఆహా’తో మీరూ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టారు. మరి.. మీరు డిజిటల్‌ రిలీజ్‌కి ఓకే అంటారా?
థియేటర్లు ఓపెన్‌ అయ్యేవరకూ ఆగేవాళ్లు ఆగుతారు. నా సపోర్ట్‌ మాత్రం థియేటర్స్‌కే. అయితే ఓటీటీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు.

పెద్ద బడ్జెట్‌ చిత్రాలేమైనా ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు మీ దృష్టికి వచ్చిందా?
నాకు తెలిసి లాక్‌డౌన్‌కి ముందు రిలీజ్‌ కావడానికి పెద్ద సినిమాలేవీ రెడీగా లేవు. నాలుగైదు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయేమో.. మరికొన్ని చిన్న చిత్రాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నాయి. ఓ బడా నిర్మాత సినిమా విడుదలకు రెడీ అయింది. లాక్‌డౌన్‌ వల్ల అది ఆగింది. ఆ సినిమాకి కూడా ఓటీటీ వాళ్లతో చర్చలు జరిగాయి.. కానీ ‘పెద్ద మొత్తం’ ఇవ్వడానికి ఓటీటీ వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే వడ్డీ భారం ఉన్నా కూడా థియేటర్లోనే విడుదల చేద్దామని ఆ నిర్మాత ఆగారు.  

► తక్కువ మందితో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసుకోవచ్చని తమిళ ఇండస్ట్రీకి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి అనుమతులు ఇంకా రాలేదు కదా?
అనధికారికంగా కొందరు తక్కువమందితో జాగ్రత్తలు పాటిస్తూ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటిస్తే కొంచెం రిలీఫ్‌గా పని చేసుకుంటారు.
     
షూటింగ్స్‌ ఎప్పటి నుంచి మొదలవుతాయనుకుంటున్నారు?
ఆగస్టు నుంచి మొదలవుతాయనుకుంటున్నాను. అయితే గతంలా ఉండకపోవచ్చు. తక్కువ మందితో షూటింగ్‌ చేయాల్సి వస్తుంది. దానివల్ల  చాలా మంది కార్మికులకు పని లేకుండా పోతుంది. అలాంటివాళ్లను ఆదుకోవడానికి ఏదోటి చేయాలి.
     
గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోని ప్రస్తుత సినిమాల పరిస్థితేంటి?
ప్రస్తుతం మా బ్యానర్లో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ‘జెర్సీ’ హిందీ సినిమా 70 శాతం షూటింగ్‌ పూర్తయి ఆగిపోయింది. తెలుగులో అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ 75 శాతం షూటింగ్‌ అయింది. కార్తికేయతో తీస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా 25 శాతం చిత్రీకరణ జరిగింది. లాక్‌డౌన్‌ ముగిశాక ఈ షూటింగ్స్‌ మొదలుపెట్టడమే.

ఒకరి మీద ఒకరం ఆధారపడ్డాం
పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించడంతో ప్రముఖ థియేటర్‌ చైన్‌ సంస్థ ఐనాక్స్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘‘థియేటర్స్‌– సినిమా నిర్మించేవాళ్లు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవాళ్లం. ఇలాంటి కష్టకాలంలో రెండు పార్టీలు లబ్ధి పొందే పద్ధతిని కాదనుకుని ఒక పార్టనర్‌ వేరే పద్ధతిని అనుసరించడం సరికాదనిపిస్తోంది. కష్ట సమయంలో అనుబంధాన్ని వదిలి, ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించినవాళ్లను భవిష్యత్తులో ఆప్తమిత్రుల్లా చూడటానికి లేదు. థియేటర్‌లో సినిమాను విడుదల చేసే విధానాన్ని మరువకండి. ఎప్పటిలానే కలసి ప్రయాణిద్దాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

నిర్మాతలు అలా ఆలోచించడం సహజం
– ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి అంగీకరించిన నిర్మాతలను ఉద్దేశిస్తూ ఎగ్జిబిటర్‌ సెక్టార్‌లోని మా సహచరులు కొందరు కటువుగా మాట్లాడటం బాధగా ఉంది. ఇప్పట్లో దేశవ్యాప్తంగా సినిమాలు ప్రదర్శితం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటి వరకు తమ సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఎదురుచూడటం అంటే వారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. తిరిగి థియేటర్స్‌ ఓపెన్‌ అయినప్పటికీ థియేటర్స్‌ ప్రేక్షకులతో నిండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మార్గాల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి నిర్మాతలు ఆలోచిస్తారు. అది సహజం. అయితే సినిమాల థియేట్రికల్‌ రిలీజ్‌నే ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సపోర్ట్‌ చేస్తుంది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్‌ ఓపెన్‌ అయినప్పుడు ఎగ్జిబిటర్‌ సెక్టార్‌కు మేం తప్పక సహకారం అందిస్తాం. అలాగే పెద్ద సంఖ్యలో థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించేందుకు మా వంతుగా మేం చేయాల్సింది అంతా చేస్తాం.

మరిన్ని వార్తలు