క్యాన్సర్‌పై అవగాహన కోసం క్రికెట్‌ 

1 Apr, 2019 00:09 IST|Sakshi

హైదరాబాద్‌ తల్వార్స్, టీసీఏ (తెలుగు సినిమా అకాడమీ) టీమ్‌లు ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో తెలుగు సినీ స్టార్స్‌ సౌత్‌ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్లతో కలిసి క్రికెట్‌ ఆడబోతున్నారు. మే17, 18వ తేదీల్లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. 19న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా వచ్చిన నిధులను సౌత్‌ఆఫ్రికాలో ఉన్న ‘చైల్డ్‌ హుడ్‌ క్యాన్సర్‌ అసోసియేషన్‌’ కు అందించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చైర్మన్‌ రమేష్‌ మాట్లాడుతూ– ‘‘క్యాన్సర్‌ నుంచి బతికిద్దాం అన్న ఆలోచనే ఈ క్రికెట్‌ ముఖ్య ఉద్దేశం. సౌత్‌ ఆఫ్రికాలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఇదే తొలిసారి’’ అన్నారు.

హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘సౌత్‌ ఆఫ్రికాలో మ్యాచ్‌ అంటే అసలు జరుగుద్దో లేదో అనుకున్నా! కానీ వాళ్ల నమ్మకం చూసి ముందుకువెళుతున్నాం. చిరంజీవి, నాగార్జునవంటి వారందరూ క్రికెట్‌ ఆడటం ముందు మొదలు పెట్టారు. ఇది కమర్షియల్‌గా ఆడే ఆట కాదు. ఒక మంచి పని కోసం మేమంతా గ్రూప్‌గా ఏర్పడ్డాం’’ అన్నారు. ‘‘ప్రతి ఆట ఒక మంచి పని కోసం ఆడతాం. సౌత్‌ ఆఫ్రికాని కూడా మనం గెలిచివద్దాం అన్నారు’’ హీరో తరుణ్‌. హీరోలు ‘అల్లరి’ నరేష్, సునీల్, నిఖిల్, ప్రిన్స్, గాయని కౌసల్య, అభినవ్‌ సర్ధార్, శ్రీధర్‌ రావ్, భూపాల్, శ్రీనివాస్, కిషోర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు