డబ్బింగ్‌ సినిమా అంటుంటే బాధగా ఉంది – సందీప్‌ కిషన్‌

8 Nov, 2017 00:52 IST|Sakshi

‘‘దర్శకుడు సుశీంద్రన్‌ సినిమాలకు నేను ఫ్యాన్‌. ఆయన మంచి దర్శకుడే కాదు.. మంచి వ్యక్తి కూడా. ఇలాంటి వ్యక్తితో సినిమా చేయడం నా లక్‌’’ అని హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. సందీప్‌ కిషన్, మెహరీన్‌ జంటగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కేరాఫ్‌ సూర్య’. శంకర్‌ చిగురుపాటి సమర్పణలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది. ప్రీ–రిలీజ్‌ వేడుకలో సందీప్‌ మాట్లాడుతూ– ‘‘తమిళ హీరోలు వారి సినిమాలను తెలుగులో డబ్‌ చేసి, మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. మన తెలుగు హీరోలు ఇప్పుడలాంటి ప్రయత్నం చేస్తుంటే, చాలా మంది నెగిటివిటీతో మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మా సినిమాని 59 రోజుల్లోనే పూర్తి చేశాం.

కష్టపడి చేసిన సినిమాను డబ్బింగ్‌ సినిమా అంటుంటే బాధగా ఉంది. మాపై నమ్మకంతో థియేటర్‌కు రండి.. సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా ‘కేరాఫ్‌ సూర్య’. తమిళంలో నాకు నచ్చిన హీరో ధనుష్‌. ఈ సినిమాలో సందీప్‌ కూడా ధనుష్‌ లాంటి పెర్ఫార్మెన్స్‌ చేశాడు’’ అన్నారు సుశీంద్రన్‌. ‘‘సుశీంద్రన్‌ వంటి డైరెక్టర్‌ సందీప్‌తో తెలుగు, తమిళంలో సినిమా చేయడం గొప్ప విషయం’’ అన్నారు ఛోటా కె. నాయుడు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజేశ్‌.

>
మరిన్ని వార్తలు