అభిమానులకు తలైవా బర్త్‌డే ట్రీట్‌ 

23 Nov, 2019 10:41 IST|Sakshi

రజనీకాంత్‌ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకు పండుగనే. ఆ రోజు తమ అభిమాన నటుడు అందుబాటులో ఉండకపోయినా,  అభిమానులు ఆయన పుట్టినరోజును ఆర్భాటాలతో జరుపుకుంటారు. ఈ ఏడాది రజనీ బర్త్‌డే సందర్భంగా ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఎదురుచూస్తోంది. రజనీకాంత్‌ నటించిన పేట చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన దర్బార్‌ చిత్రంలో నటిస్తున్న విషయం విధితమే. షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటించింది. ఏఆర్‌.మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెరపైకి తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి, కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 7న విడుదల చేయనున్నట్లు సమాచారం.

మరో విశేషం ఏమిటంటే రజనీకాంత్‌ 25 ఏళ్ల క్రితం నటించిన బాషా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిత్రంతోనే ఆయన దక్షిణ భారత సూపర్‌స్టార్‌ అయ్యారు. రజనీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఈ చిత్రాన్ని సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో సత్యమూవీస్‌ సంస్థ నిర్మించింది. రజనీకాంత్‌ 70వ పుట్టిన రోజు సందర్భంగా బాషా చిత్రాన్ని డిజిటలైజ్‌ చేసిసరికొత్తగా డిసెంబర్‌ 11న తమిళనాడులోని ప్రధాన నగరాల్లో విడుదలచేయనున్నట్లు సత్యామూవీస్‌ వర్గాలు వెల్లడించాయి. రజనీకాంత్‌ అభిమానులకు బర్త్‌డే కానుక అని సంస్థ పేర్కొంది. ఇటీవలే ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ అవార్డును అందుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు బాషా చిత్ర రీ రిలీజ్‌ సర్‌ప్రైజే అవుతుంది.

మరిన్ని వార్తలు