ఇంటికి దాసరి భౌతికకాయం తరలింపు

30 May, 2017 23:24 IST|Sakshi
ఇంటికి దాసరి భౌతికకాయం తరలింపు

హైదరాబాద్‌: దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌ లోని ఆయన ఇంటికి తరలించారు. తీవ్ర ఆనారోగ్యంతో గత కొన్ని రోజులుగా సతమతమవుతున్న దాసరి వారం రోజుల కిందట మరోసారి కిమ్స్‌ లో చేరి అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తర్వాత మృతిచెందిన విషయం తెలిసిందే. దాసరి మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాసరి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.

దాసరితో వారికి ఉన్న అనుబంధాన్ని షేర్‌ చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. దర్శకరత్న దాసరి మృతి ఇండస్ట్రీకి తీరనిలోటని, ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ టాలీవుడ్‌ ప్రముఖులు వాపోతున్నారు. విక్టరీ వెంకటేశ్‌, డా. రాజశేఖర్‌, జీవిత, నిర్మాతలు సురేష్‌ బాబు, అశోక్‌, దర్శకులు బోయపాటి శ్రీను, సుకుమార్‌, విజయశాంతి, హేమ, అలీ, సనీ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు దాసరి భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులర్పిస్తున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మొయినాబాద్‌లో ప్రభుత్వ లాంచనాలతో దాసరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.