-

క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి

30 Dec, 2016 23:50 IST|Sakshi
క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి

‘‘గురువారం సినిమా చూశా. ట్రెండీగా, ఫ్యామిలీలకు నచ్చే విధంగా దర్శకుడు బాగా తీశారు. క్లైమాక్స్‌లో రావు రమేశ్‌ నటనకు కన్నీళ్లు వచ్చాయి’’ అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. హెబ్బా పటేల్, రావు రమేశ్, తేజస్వి, అశ్విన్, నోయెల్, పార్వతీశం ముఖ్య తారలుగా బండి భాస్కర్‌ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్‌ (గోపీ) నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌’ ఈ నెల 16న విడుదలైంది. శుక్రవారం చిత్రబృందాన్ని దాసరి అభినందించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రాన్ని 40 రోజుల్లో కంఫర్ట్‌బుల్‌ బడ్జెట్‌లో చేశారని తెలిసి ఆశ్చర్యపోయా. షెడ్యూల్‌ ప్రకారం అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడం అరుదుగా జరుగుతుంది.

గోపీ ఇలాగే మంచి సినిమాలను తీయాలి. నోట్ల రద్దు లేకపోతే ఇంకా బాగా కలెక్ట్‌ చేసేది’’ అన్నారు. ‘‘దాసరిగారు నా తొలి చిత్రాన్ని మెచ్చుకోవడం అంటే అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు దర్శకుడు. ‘‘దాసరిగారి ఆశీస్సులతో మరిన్ని మంచి చిత్రాలు తీస్తా’’ అన్నారు బెక్కం వేణుగోపాల్‌.