సాక్షి,న్యూఢిల్లీ : బాలీవుడ్ భామ దీపికా పడుకోన్, హీరో రణ్వీర్ సింగ్ల పెళ్లిపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ నవంబర్ 19న వివాహ బంధంతో ఒక్కటికానున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో దీపికతో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు రణ్వీర్ సింగ్ దీనిపై నోరుమెదపలేదు. తమ పెళ్లి ఖరారైతే మొదట తానే బహిరంగంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు రణ్వీర్తో తన అనుబంధంపై దీపికా పడుకోన్ ఇంతవరకూ పెదవివిప్పలేదు.
గత ఏడాది డిసెంబర్లో ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహ వేడుక అనంతరం దీపికా,రణ్వీర్ సింగ్ల వివాహమే హాట్ టాపిక్ అయింది. ఇక మేలో అనిల్ కపూర్ గారాల పట్టి సోనమ్ కపూర్, ఢిల్లీ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాలా వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇదే నెలలో అంగద్ బేడీ, నేహా ధూపియాల వివాహ వేడుక జరిగింది. మరి ఇదే ఏడాది దీపికా, రణ్వీర్లు వివాహ బంధంతో ఒక్కటవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.