‘భారత్‌’ మూవీ విడుదలపై ఉత్కంఠ

3 Jun, 2019 14:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారత్‌ మూవీ విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. దేశం పేరుతో రూపొందిన ఈ సినిమా దేశ సాంస్కృతిక, రాజకీయ ప్రతిష్టను మసకబార్చేలా ఉందన్న పిటిషనర్‌ ఆరోపణలపై విచారణకు హైకోర్టు ముందుకొచ్చింది.

జూన్‌ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల వినతిని జస్టిస్‌ జేఆర్‌ మిధా, జస్టిస్‌ చందర్‌శేఖర్‌లతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ అంగీకరిస్తూ దీనిపై ఈరోజే విచారిస్తామని పేర్కొంది. ఎంబ్లమ్స్‌, నేమ్స్‌ చట్టం ప్రకారం భారత్‌ పేరును ఎలాంటి వ్యాపారం, వర్తకం, వృత్తి లేదా ట్రేడ్‌మార్క్‌, పేటెంట్‌లాగా వాడుకోవడం నిషిద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ‘భారత్‌’  దేశ అధికారిక నామమని, ఈ పేరుతో సినిమా టైటిల్‌ సరైంది కాదని పిటిషనర్‌ వికాస్‌ త్యాగి నివేదించారు. సినిమా విడుదలపై మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

>
మరిన్ని వార్తలు