నేను పెద్ద స్టార్‌ అవుతానన్నారు

31 Aug, 2018 05:36 IST|Sakshi
అలీ, ఖయ్యూమ్‌

అలీ

‘‘టి. కృష్ణగారి ‘దేశంలో దొంగలుపడ్డారు’ సినిమాలో వేషం కోసం వెళ్లా. ‘నీ ఫేస్‌ కామెడీగా ఉంటుంది.. పైగా చిన్నపిల్లాడివి.. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు.. వద్దు.. అన్నారు. ‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్‌ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆ రోజే చెప్పారట’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’.

గౌతమ్‌ రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో రమా గౌతమ్‌ నిర్మించిన ఈ సినిమాకి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారి స్నేహితుడు నాగేశ్వరరావుగారు ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో తీసిన ‘అమ్మాయి కాపురం’ సినిమాకు నాకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు వచ్చింది.  ‘దేశంలో దొంగలుపడ్డారు’ కోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పని చేశానని నా తమ్ముడు ఖయ్యూమ్‌ చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశా.

గౌతమ్‌ రాజ్‌కుమార్‌ కొత్త దర్శకుడైనా తనని చూస్తే 30 ఏళ్లకు ముందు రామ్‌గోపాల్‌ వర్మను చూసినట్టు అనిపించింది’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ అంశాన్ని హైలైట్‌ చేస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్‌ బెర్రీ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అన్నారు గౌతమ్‌ రాజ్‌కుమార్‌. ఖయ్యూమ్, సహ నిర్మాత సంతోష్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సాయికుమార్‌ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్‌ డొంకాడ, సెలెట్‌ కనెక్ట్స్‌.

మరిన్ని వార్తలు