ఆ ఇద్దరి అనుబంధం చూస్తే గుండమ్మ కథ గుర్తొచ్చింది – అశ్వనీదత్‌ 

26 Sep, 2018 00:27 IST|Sakshi

నాగార్జున, నాని హీరోలుగా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా కథానాయికలు. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం పలు విశేషాలు పంచుకున్నారు. అశ్వనీదత్‌ మాట్లాడుతూ – ‘‘మహానటి’ సినిమా ప్రొడక్షన్‌ మొత్తం నా కూతుళ్లే చూసుకున్నారు. ‘దేవదాస్‌’ సినిమాతో వైజయంతీ మళ్లీ ప్రేక్షకుల  ముందుకు వస్తోంది. ఇంకా ముందుకు వెళ్లడానికి, నన్ను, మా పిల్లలను ఆశీర్వదించండి. నా కెరీర్‌లో చాలా మల్టీస్టారర్‌లు చేశాను. ‘దేవదాస్‌’ గురించి వేరేవాళ్ల దగ్గర చెబుతూ, ‘గుండమ్మ కథ’ను రిఫర్‌ చేశాను. ఆ సినిమాలో రామారావుగారు, నాగేశ్వరరావుగారు కలిసి చేసిన విధానం గుర్తొచ్చింది. అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున, నానీల అనుబంధం చూసినప్పుడు ఆ సినిమా గుర్తొచ్చింది. సినిమాని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది’’ అన్నారు. 

నాగార్జున మాట్లాడుతూ – ‘‘అశ్వనీదత్‌గారు పని విషయంలో ‘ఆఖరి పోరాటం’ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు, అల్లుడు కూడా తోడయ్యారు. నాలో వచ్చిన మార్పేంటంటే పంక్చువల్‌ అయినట్లున్నాను. నానీకి, నాకు మధ్య ఫ్రెండ్‌షిప్‌ కీలకంగా ఈ సినిమా సాగుతుంది. టైటిల్‌ ముందు అనుకోలేదు. నా పేరు దేవ అని ముందే అనుకున్నాం. నానీ పేరు కృష్ణ. కాని తర్వాత దాస్‌ చేర్చి కృష్ణదాస్‌ చేశాడు దర్శకుడు. అలా దేవదాస్‌ అయింది.  ఇంత చిన్న వయసులో అంతమంది స్టార్స్‌ని సెట్లో హ్యాండిల్‌ చేయడం గ్రేట్‌. ఈ సినిమా మొన్నే చూశాను. ఓ నెల రోజుల ముందు కంప్లీట్‌ అయ్యుంటే మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘ఇది చాలా ప్రెషర్‌గా ఫీలయ్యే వీక్‌. దేవదాస్‌ రిలీజ్, బిగ్‌బాస్‌ ఫైనల్‌తో ఫుల్‌ టెన్షన్‌. అలానే ఎగై్జటింగ్‌గా ఉంది. ఈ ఆదివారం పూర్తయితే ప్రశాంతంగా కాశీకి వెళ్లాలనుంది (నవ్వుతూ)’’ అన్నారు.‘‘మల్టీస్టారర్, సింగిల్‌ స్టార్‌ అని తేడా ఉండదు. ఇది ఏ హాలీవుడ్‌ సినిమాకు రీమేక్‌ కాదు. లొకేషన్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. స్టార్స్‌ని డీల్‌ చేస్తున్న భావన కలగలేదు’’ అన్నారు శ్రీరామ్‌ ఆదిత్య.  

>
మరిన్ని వార్తలు