‘అర్జున్‌రెడ్డి’ బర్త్‌డే.. వినూత్న ఆలోచన!

9 May, 2018 10:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇండస్ట్రీలో తనకంటూ గాడ్ ఫాదర్స్ లేకున్నా స్వయంకృషితో రాణిస్తోన్న నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’తో సక్సెస్ అందుకున్న హీరో విజయ్.. ఆపై ‘అర్జున్‌రెడ్డి’తో మరోసారి నిరూపించుకున్నాడు. ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఆలోచించే నటుడు విజయ్ పుట్టినరోజు నేడు(మే 9). అయితే తన బర్త్‌డే సందర్భంగా బర్త్‌డే ట్రక్‌లను ఏర్పాటు చేశాడు ‘అర్జున్‌రెడ్డి’. హైదరాబాద్ నగరవాసులకు ఐస్‌క్రీమ్స్ అందిస్తూ బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నాడు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు విజయ్. ఈ నటుడు చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

‘ వేసవి ఎండల్లోనూ కొన్ని రోజులు షూటింగ్ చేశాక నాకు ఈ ఆలోచన వచ్చింది. మూడు ఐస్‌క్రీమ్ ట్రక్కులను తీసుకున్నా. ట్రక్కులు హైదరాబాద్ సిటీలో తిరుగుతూ ట్రాఫిక్ పోలీసులు, చిరువ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిస్తాయి. మీకు ఎక్కడైనా నా బర్త్‌డే ట్రక్ కనిపిస్తే ఏం సిగ్గుపడకుండా ఐస్‌క్రీమ్ తీసుకోండి. హాయిగా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను నాకు షేర్ చేయండి. మీకు ముఖాల్లో ఆనందాన్ని చూస్తే నేను హ్యాపీగా ఫీలవుతానంటూ’ హీరో విజయ్ తన ట్వీట్లలో రాసుకొచ్చారు.
 

మరిన్ని వార్తలు