ధనుష్‌ వీఐపీ-2 వచ్చేస్తోంది

13 Jun, 2017 21:30 IST|Sakshi
ధనుష్‌ వీఐపీ-2 వచ్చేస్తోంది

వీఐపీ-2 చిత్రం విడుదలకు తేదీ ఖరారైంది. నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన, నిర్మించిన వేలైఇల్లా పట్టాదారి (వీఐపీ) మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం వీఐపీ-2.

ఈ చిత్రంలో అమలాపాల్‌ నాయకిగా నటించింది. ముఖ్య పాత్రలో బాలీవుడ్‌ భామ కాజోల్‌ నటించడం విశేషం. ఇందులో ఆమె ప్రతినాయకిగా నటించారని సమాచారం. కాగా,నటుడు ధనుష్‌ కథ, కథనాలు అందించిన ఈ చిత్రానికి సౌందర్యరజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. సాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందించగా ఇంజినీర్లు తమ హక్కుల కోసం పోరాడే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిసింది. ఇటీవల వండలూర్‌ సమీపంలోని మణివాక్కంలో 300 మంది ఇంజినీర్లు పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్రవర్గాలు తెలిపాయి.

నిర్మాత కలైపులి ఎస్‌.థాను, ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలింస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. పా.పాండి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ధనుష్‌ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు.