ముగ్గురు ముద్దుగుమ్మలతో ధనుష్

21 Oct, 2016 03:06 IST|Sakshi
ముగ్గురు ముద్దుగుమ్మలతో ధనుష్

 ఈ తరం హీరోయిన్లు ఒక్కరుంటేనే ఆ చిత్రంలో గ్లామర్‌కు కొరత ఉండదు. అలాంటిది ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో పోటీపడితే, అదీ యువ స్టార్ నటుడు ధనుష్‌తో ఆ ముగ్గురూ రొమాన్స్ చేస్తే ఆ చిత్రానికి ఏర్పడే క్రేజే వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఆసక్తికరమైన చిత్రమే బుధవారం చాలా నిరాడంబరంగా షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకుంది. ఇంతకీ ఈ చిత్రంలో నటించే హీరోహీరోయిన్లు ఎవరన్నది చెప్పలేదు కదూ చిన్న క్లూ ఇస్తే మీకే అర్థమైపోతుంది.
 
 అదేమిటంటే ఈ చిత్రానికి కెప్టెన్సీ బాధ్యతల్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ వారసురాలు సౌందర్య నిర్వహిస్తున్నారు. అర్థమైపోయింది కదూ’ ఎస్ ఈ క్రేజీ చిత్రం హీరో ధనుష్. ఇక ఆయనకు జంటగా నటిస్తున్న బ్యూటీస్ బాలీవుడ్ భామ సోనంకపూర్, కాజల్‌అగర్వాల్, మంజిమామోహన్. కాగా వీరిలో సోనంకపూర్ రాంజనా అనే హిందీ చిత్రంలోనూ, కాజల్‌అగర్వాల్ మారి చిత్రంలోనూ ధనుష్ సరసన నటించారు.
 
  ఇక నటి మంజిమా మోహన్ తొలిసారిగా ఆయనతో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిలవుక్కు ఎన్‌మేల్ ఎన్నడీ కోపం అనే టైటిల్‌ను నిర్ణయించారు. మరో విశేషం ఏమిటంటే దీనికి కథ, కథనం, మాటలను ధనుష్ సమకూర్చారు. మరో విశేషం రజనీకాంత్ కథానాయకుడిగా కబాలి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మించడం. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టెయినర్‌గా తెరకకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది.