ఓన్లీ ఎంటర్‌టైనర్ ధనుష్

30 Jun, 2013 07:11 IST|Sakshi
ఓన్లీ ఎంటర్‌టైనర్ ధనుష్
ఈ సారి ఓన్లీ ఎంటర్‌టైనర్ నో మెసేజ్ అంటున్నాడు దర్శకుడు సర్గుణం. ఇంతకు ముందు విమల్ హీరోగా కలవాణి, వాగైచూడవా చిత్రాలను తెరకెక్కించారు సర్గుణం. తాజాగా ధనుష్ హీరోగా నైయ్యాండి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గత చిత్రాలను గ్రామీణ నేపథ్యంలో తెరపై ఆవిష్కరించారు సర్గుణం. తన పాత చిత్రాలకు భిన్నమైన నేపథ్యంలో నైయ్యాండిని తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధనుష్‌కు జంటగా నజ్రియా నజీం నటిస్తోందన్నారు.
 
 ప్రమిదలు తయారు చేసి విక్రయించే కుటుంబానికి చెందిన యువకుడికి దంత వైద్యురాలికి మధ్య ఏర్పడ్డ ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నదే నైయ్యాండి చిత్ర కథని వెల్లడించారు. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నానని, ఎలాంటి సందేశమూ ఉండదని స్పష్టం చేశారు. చిత్రాన్ని 49 రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. అందులో 25 రోజుల్లో టాకీ పార్టును పూర్తి చేసినట్లు వివరించారు. చిత్రానికి సంగీతం జిబ్రాన్, పాటలను అరివుమది, వివేక్, కార్తీక్ నేతా అందిస్తున్నారని వెల్లడించారు. వేల్‌రాజ్ ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు సర్గుణం పేర్కొన్నారు.