తమిళసినిమా: హీరో కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రం ధీరన్ అధికారం ఒన్రు. ఈ చిత్రంలో ఆయన సరసన రకుల్ ప్రీత్సింగ్ నాయకిగా నటించింది. దర్శకత్వ బాధ్యతలను హెచ్.వినోద్ చేపట్టగా, సంగీతాన్ని జిబ్రాన్ సమకూర్చారు. సత్యన్ సూరియన్ స్క్రీన్ ప్లే చేసిన ఈ చిత్ర విశేషాలను గురించి దర్శకుడు వినోద్ తెలుపుతూ కార్తీ ఇప్పటికే పలు చిత్రాల్లో పోలీసు పాత్రల్లో నటించారు. ఇందులో ఆయన పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో కార్తీ పేరు ధీరన్ అలియాస్ తిరుమారన్.
ఇందులో కార్తీ ప్రేమ, పెళ్లి, ఉద్యోగం మూడు కలిసిందే అధికారం ఒన్రు. పోలీసు బాధ్యతలో ఎదుర్కొనే సమస్యల సమూహారమే ధీరన్ అధికారం ఒండ్రు. బాధ్యతల్లో భాగంగా ఉత్తరాదికి వెళ్లే కార్తీ అక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమస్యను ఎదుర్కొంటారు. కార్తీకి సమస్యను కలిగించే విలన్ల పాత్రల్లో ఆయా రాష్ట్రంలో చిత్ర రంగంలో విలన్ పాత్రల్లో ప్రసిద్ధి చెందిన వారే నటించారు. ముంబైలో జవీన్కా, మరాఠిలో కిషోర్ కదం, బోజ్పురిలో రోహిత్ భంగత్, గుజరాత్ అభిమన్యూ సింగ్లు నటించారు.
1995 నుంచి 2005 వరకు పదేళ్ల పాటు జరిగే జీవితమే ఈ చిత్ర కథ అని చిత్ర దర్శకుడు వినోద్ తెలిపారు. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 2న, చెన్నై సత్యం థియేటర్లో జరుగనుంది. అన్నట్టు ఆదివారం ఈ చిత్ర సింగిల్ ట్రాక్ పాటను విడుదల చేశారు. ఇప్పుడా పాట సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తూ రికార్డుల బాట పట్టింది.