కబడ్డీ పోటీకి క్రికెట్ జట్టు

6 Nov, 2016 03:12 IST|Sakshi
కబడ్డీ పోటీకి క్రికెట్ జట్టు

కబడ్డీ పోటీల్లో గెలవడానికి సిద్ధమైన క్రికెట్ టీమ్.కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ. ఇలాంటి విభిన్న కథాంశంతో తెరకెక్కితున్న చిత్రం ధోని కబడ్డీ కుళు.మనిదం తిరైక్కళం పతాకంపై ఎస్.నందన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కే.మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ.వెంకటేశ్ శిష్యుడు పి.అయ్యప్పన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బుల్లితెరలో మైడియర్ భూతం అనే సీరియల్‌లో బాల నటుడిగా నటించిన అభిలాస్ హీరోగా పరిచయం అవుతున్నారు.
 
 అరియన్ అనే నటి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో టీకడై అనే ముఖ్య పాత్రలో సీజీ.ప్రభాకరన్ నటిస్తుండగా ఇతర పాత్రల్లో కాంత, నవీన్, శంకర్, శక్తివేల్ మురుగన్, తెనాలి, ప్రభాకర్, పీటర్, సుజన్ సౌందర్‌రాజన్, ఏఆర్.పుగళ్‌కుమార్‌వేల్, శరత్, విజయ్‌గౌతమ్ నటిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక గ్రామంలో హీరో మిత్ర బృందం క్రికెట్ క్రీడే శ్వాసగా ఆడుతుంటారన్నారు.అలాంటిది ఒక సమయంలో ఆ గ్రామానికి అనూహ్యంగా ఒక సమస్య వచ్చి పడుతుందన్నారు. దాన్ని పరిష్కరించడానికి డబ్బు అవసరం అవుతుందని తెలిపారు.
 
 అరుుతే అదే సమయంలో పక్క గ్రామంలో కబడ్డీ పోటీలు జరుగుతుంటాయని, ఈ క్రికెట్ టీమ్ తమ గ్రామ సమస్యను తీర్చడానికి పక్క ఊరిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకంటారన్నారు.అయితే ఆ పోటీల్లో గెలిచి నగదు బహుమతి పొందారా? తమ గ్రామ సమస్యను పరిష్కరించుకున్నారా? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన జనరంజక కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్ర దోని కబడ్డీ కుళు అని తెలిపారు. ఇందులో కబడ్డీ సన్నివేశాలను మాత్రమే 20 రోజులు చిత్రీకరించినట్లు, అందుకు హీరో మిత్ర బృందం నెల రోజుల పాటు శిక్షణ పొందినట్లు తెలిపారు.చిత్ర షూటింగ్ పూర్తి అయిందని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు.