సమయం దగ్గర పడుతోంది మిత్రమా!

17 Jul, 2017 02:58 IST|Sakshi
సమయం దగ్గర పడుతోంది మిత్రమా!

తమిళసినిమా: సమయం దగ్గర పడింది మిత్రమా ఇంకా 30 రోజులే అంటున్నారు దర్శకుడు గౌతమ్‌మీనన్‌. ఇంతకీ దేని గురించి ఈయన చెబుతున్నది. ఇంక దేని గురించి ఆయన తాజా చిత్రం ధ్రువనక్షత్రం గురించే. విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా రీతువర్మ కోలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ మొదటి నుంచి పలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు గాడిన పడిందనే చెప్పాలి.

ఇటీవలే బల్గేరియాలో చిత్రీకరణను పూర్తి చేసుకుని చిత్ర యూనిట్‌ చెన్నైకి తిరిగొచ్చారు. ధ్రువనక్షత్రం చిత్రం ఎంతవరకు పూర్తి అయ్యింది, ఇంకా ఎంత చిత్రీకరణ జరుపుకోవలసి ఉంది అన్న ఆసక్తి చాలా మంది ప్రేక్షకుల్లో నెలకొంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడానికేమో చిత్ర దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ధ్రువనక్షత్రం  షూటింగ్‌ కార్యక్రమాలు ఇంకా 30 రోజులే మిగిలి ఉంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కు సిద్ధం అవుతున్నాం అని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అందులో భాగంగా రెండు చిత్ర ఫొటోలను కూడా ఆయన విడుదల చేశారు. కాగా ధ్రువనక్షత్రం చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయట.