విడిపోతున్నాం..ఇంకేమీ అడగకండి ప్లీజ్‌!

1 Aug, 2019 13:09 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌లో మరో జంట విడాకులకు సిద్ధమైంది. ఐదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు నటి దియా మీర్జా, ఆమె భర్త సాహిల్‌ సంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దంపతులుగా విడిపోయినప్పటికీ తాము ఎల్లప్పుడూ స్నేహితులుగానే ఉంటామని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ పదకొండేళ్లుగా ఒకరికై ఒకరుగా బతికిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మధ్య భార్యాభర్తల బంధం లేకపోయినా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదు. మా జీవన ప్రయాణంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ కలిసి గడిపిన క్షణాలను,  బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరం కృతఙ్ఞతా భావం కలిగి ఉంటాము. ఇటువంటి సమయంలో మాకు తోడుగా నిలిచి, మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. అదేవిధంగా మా వ్యక్తిగత విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచడంలో..సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు. ఇక ఈ విషయంపై స్పందించాలనుకోవడం లేదు.  దయచేసి మీడియా నా విన్నపాన్ని మన్నించాలి’ అంటూ దియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో తన, తన భర్త పేరిట ఓ లేఖ షేర్‌ చేశారు.

కాగా హైదరాబాద్‌ భామ దియా మీర్జా తన చిరకాల స్నేహితుడు సాహిల్‌ సంగాతో ఆరేళ్ల పాటు డేటింగ్‌ చేశారు. తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో 2014, అక్టోబరులో ఢిల్లీలోని ఓ ఫామ్‌హౌజ్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి బాబీ జాసూస్‌ వంటి పలు చిత్రాలను నిర్మించారు. ఇక సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉండే దియా... భారత్‌ తరఫున ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. పర్యావరణ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రచారంలో చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఒక స్క్రిప్ట్ వినిపించడానికి తొలిసారిగా తన దగ్గరికి వచ్చిన సమయంలో సాహిల్‌తో ప్రేమలో పడినట్లు దియా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

మరిన్ని వార్తలు