రెండు విడాకులు.. ఒక రూమర్‌!

3 Aug, 2019 14:25 IST|Sakshi
విడాకులు తీసుకున్న సినీ జంటలు దియా మీర్జా-సాహిల్‌ సంఘా, ప్రకాశ్‌ కోవెలముడి-కనికా దిల్హాన్‌

ఉబుసుకోక ఊహాలకు పనిచెప్పే గాసిప్‌రాయుళ్లు కొందరుంటారు. తలా-తోకాలేని ఊహాలతో కథనాలల్లి.. మీడియాలో పుకార్లకు షికార్లు తొడుగుతారు. తాజాగా ఓ రెండు జంటలు తాము వేరవుతున్నట్టు ప్రకటించాయి. వైవాహిక బంధం నుంచి తప్పుకొని.. పరస్పర సామరస్యంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించాయి. అంతే, రాసిప్‌రాయుళ్లు తమ చెత్తబుర్రలకు పదును పెట్టారు. ఈ జంటల విడాకులకు మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించి.. ఎఫైర్‌ కారణంగానే వాళ్లు విడిపోయారంటూ కథనాలు అల్లారు. దీనిపై ఆ జంటలు స్పందించి.. ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాయి. ఇటీవల విడాకులు తీసుకున్న సినీ జంటలు దియా మీర్జా-సాహిల్‌ సంఘా, ప్రకాశ్‌ కోవెలముడి-కనికా దిల్హాన్‌ విషయంలో ఇది జరిగింది.

బాలీవుడ్‌ నటి దియా మీర్జా తన భర్త సాహిల్‌ సంఘా నుంచి వేరవుతున్నట్టు ప్రకటించగా.. అదే సమయంలో దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడి భార్య, స్క్రీన్‌రైటర్‌ కనికా దిల్హాన్‌ తాము విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. దీంతో దియా-సాహిల్‌ విడాకులకు కారణం కనికా దిల్హాన్‌ అని వదంతులకు తెరతీశారు. సాహిల్‌తో కనికకు ఉన్న ఎఫైర్‌ కారణంగా ఈ రెండు జంటలు వేరయ్యాయి అంటూ కథనాలు సృష్టించారు. దీనిపై దియా మీర్జా స్పందిస్తూ.. ఈ వదంతులకు అసలు అర్థమే లేదని కొట్టిపారేశారు. తాము విడిపోవడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయమే లేదని ఆమె ట్విటర్‌లో స్పష్టం చేశారు. కనిక కూడా ట్విటర్‌లో ఈ కథనాలపై స్పందించారు. దియా, సాహిల్‌లను తన జీవితంలో ఏనాడూ కలుసుకోలేదని స్పష్టం చేశారు. ఇది అత్యంత దారుణమైన, జుగుప్సకరమైన వదంతులని, టాబ్లాయిడ్లు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మండిపడ్డారు. ఏకకాలంలో జరిగిన రెండు ఘటనల మధ్య ఇంటర్‌లింక్‌ను సృష్టించడం సరికాదని, తాను ఫిక‌్షన్‌ రైటర్‌నని, తనను మించిపోయారని గాసిప్‌రాయుళ్లను ఎద్దేవా చేశారు. సాహిల్‌ సంఘా కూడా ఈ వదంతులను తీవ్రంగా ఖండించారు. 

మరిన్ని వార్తలు