బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

20 Sep, 2017 23:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు బిగ్‌బాస్‌షో తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంతో తొలి సీజన్‌కు శుభం కార్డు పడనుంది. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న షోకు పెద్ద ఎత్తున టీఆర్పీ రేటింగులు కూడా వచ్చాయి. గతవారం వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చిన దీక్ష పంత్‌ ఎలిమినేట్ అవ్వగా.. ఐదుగురు ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఎలిమినేట్‌ అయ్యి ఇంటికి చేరుకున్న దీక్ష సంచలన విషయాలను వెల్లడించింది.

ఇంటి సభ్యుల మీద దీక్ష తీవ్ర ఆరోపణలు చేసింది. షోలో తనను అందరూ కావాలనే ఒంటరి చేశారని ఆరోపించింది. ఎలిమినేట్‌ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు తన గురించే మాట్లాడుతున్నారని వాపోయింది. ముఖ్యంగా అర్చన తనను టార్గెట్‌ చేస్తూ మాట్లాడటం బాధ కలిగిస్తోందని దీక్ష తెలిపింది. బిగ్‌బాస్‌షోకు ముందు ధనరాజ్‌ తాను బంతిపూల జానకీ సినిమా చేశామని.. అప్పడు తనను బయట కలుద్దామని అడిగేవాడని.. అందుకు తాను అంగీకరించలేదని చెప్పింది.

ఆ కారణంతో ధనరాజ్ బిగ్‌బాస్‌ హౌస్ లో ఉన్నంత కాలం తనను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేశాడని తెలిపింది. అంతేకాదు ఇంటికి వచ్చి ఎపిసోడ్‌లు చూసుకుంటే తాను తింటున్న, నిద్రపోయిన, ఏడ్చే సీన్లు చూపించారని దీక్ష ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.