అంతా కొత్తగా ఉంటుంది

2 Feb, 2019 03:06 IST|Sakshi
నరసింహరాజు, బిత్తిరి సత్తి, చాందిని, దిలీప్‌కుమార్, పద్మనాభ్, వెంకటేశ్వరరావు

కృష్ణ హీరోగా వచ్చిన ‘నెంబర్‌వన్‌’ చిత్రంతో బాలనటుడిగా పరిచయమైన దిలీప్‌కుమార్‌ చలవాది దాదాపు 30 సినిమాలు చేశారు. ఆ తర్వాత హీరోగా మారి నాలుగు సినిమాలు చేశారు. తాజాగా ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మించారు. పద్మనాభ్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దిలీప్‌ కుమార్‌ చలవాది మాట్లాడుతూ– ‘‘ఆడియో ఫంక్షన్‌ అనగానే చాలా మంది నన్ను ‘గెస్ట్‌ ఎవరు అని?’ అడిగారు. నాకు ఎవ్వరూ గెస్ట్‌లు వద్దు.. ప్రేక్షకులే నా అతిథులు అన్నాను.

నన్ను నమ్మి డబ్బులు పెట్టిన రాజు అన్నకు థ్యాంక్స్‌. 1970 నేపథ్యంలోని కథతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. సినిమా కోసం చచ్చిపోతాం.. అలాంటి ఫ్యామిలీ మాది. ‘దిక్సూచి’ అనే ఫౌండేషన్‌ కూడా స్టార్ట్‌ చేశాను. ఈ సినిమా చూసి నన్ను సపోర్ట్‌ చేయాలి’’ అన్నారు.  ‘‘దిలీప్‌ స్టోరీ లైన్‌ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ సినిమా చూశాక అనిపించింది.. నేనేనా ఈ చిత్రాన్ని నిర్మించింది అని. అంత కొత్తగా ఉంటుందీ సినిమా’’ అన్నారు నరసింహరాజు. చాందిని, సుమన్, అరుణ్, గాంధీ, చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ధన్వీ తదితరులు మాట్లాడారు. 

మరిన్ని వార్తలు