క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు

28 Aug, 2019 04:56 IST|Sakshi

‘‘పండగరోజుల్లో తమ సినిమాలను విడుదల చేయాలని అందరూ అనుకోవడంలో తప్పు లేదు. సెలవులు లేని రోజుల్లో వారానికి ఒకరు ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకోవడం మంచిదే. ప్యాన్‌ ఇండియా సినిమాలు ‘సాహో, సైరా నరసింహారెడ్డి’ విడుదలవుతున్నప్పుడు ఇలాగే ఆలోచించి విడుదల ప్లాన్‌ చేసుకోవాలి.. అలాగే నిర్ణయం తీసుకున్నాం. రెండు సినిమాలు ఒకేసారి క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నాని హీరోగా నటించిన ‘నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌’, వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘వాల్మీకి’ చిత్రాలు సెప్టెంబర్‌ 13న విడుదలకు సిద్ధమయ్యాయి.

ఒకేరోజు రెండు చిత్రాలు విడుదలైతే నిర్మాతలకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నందున ‘ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌’ రెండు చిత్రాల నిర్మాతలను పిలిచి మాట్లాడారు. చర్చల అనంతరం సెప్టెంబర్‌ 13న ‘నానిస్‌ గ్యాంగ్‌లీడర్‌’, సెప్టెంబర్‌ 20న  ‘వాల్మీకి’ సినిమా విడుదల చేయడానికి ఆయా నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ‘‘రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ ఒకేరోజున కుదిరాయి. ఆ సినిమాల నిర్మాతలిద్దరూ మా గిల్డ్‌ గ్రూపులో సభ్యులే కాబట్టి ఓ సినిమాను వెనక్కి వెళ్లమని వారిని ఒప్పించాం’’ అన్నారు నిర్మాత కె.ఎల్‌.దామోదర ప్రసాద్‌. ‘‘వాల్మీకి’ ని సెప్టెంబర్‌ 20న విడుదల చేసేందుకు ఒప్పుకున్న నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంటలకు, గిల్డ్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు నిర్మాత నవీన్‌ ఎర్నేని.  ‘‘ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సామరస్యంగానే ముందుకు వెళ్లాలి. వరుణ్‌ తేజ్, హరీశ్‌ శంకర్‌ సహకారానికి, గిల్డ్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు నిర్మాత రామ్‌ ఆచంట.
 

మరిన్ని వార్తలు