‘దిల్‌’ రాజుకి ఏమైనా మెంటలా అనుకున్నారు

30 Jan, 2020 00:15 IST|Sakshi
‘దిల్‌’ రాజు, సమంత, శర్వానంద్‌

– ‘దిల్‌’ రాజు

‘‘తమిళచిత్రం ‘96’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాం అని వార్తలు రాగానే వీళ్లకేమైనా పిచ్చా? ‘దిల్‌’ రాజుకేమైనా మెంటలా? అని కామెంట్స్‌ వినిపించాయి. నేను ఏ ఫీలింగ్‌తో అయితే ఉన్నానో రేపు సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్‌ కలుగుతుంది’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళ చిత్రం ‘96’కి ఇది రీమేక్‌. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.

ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘నా 17 ఏళ్ల కెరీర్‌లో ఇది తొలి రీమేక్‌. తమిళంలో రిలీజ్‌ కాకముందే చూశాను. తమిళం అర్థం కాకపోయినా ఆ పాత్రలతో కనెక్ట్‌ అయి ప్రయాణించాను. అప్పుడే రీమేక్‌ చేయాలని నిశ్చయించుకున్నాను. నాపై నమ్మకం ఉంచి సినిమా చేయమని సమంతకు చెప్పాను. సినిమా చూసి చేస్తానని శర్వా (శర్వానంద్‌) చెప్పాడు. ‘జాను’ చూశాక అమ్మాయిలు శర్వాతో,  అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి లవర్‌ మనకు లేరని ఈర్ష్య పడతారు’’ అన్నారు. ‘‘రీమేక్‌ చేయాలా వద్దా? అని మాట్లాడుకుంటున్నప్పుడు రాజు అన్న ‘నన్ను నమ్ము’ అన్నారు.

ఆయన జడ్జిమెంట్‌ మీద నాకు నమ్మకం ఉంది. ‘శతమానం భవతి’ అప్పుడు కూడా ఇదే అన్నారు. నాకు మంచి హిట్‌ ఇచ్చారు. ఈసారి కూడా అదే చేస్తారనుకుంటున్నాను. సమంతగారు లేకపోతే నేను అంతగా యాక్ట్‌ చేయలేకపోయేవాడినేమో. లవ్‌ ఫెయిల్యూర్‌ అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఫస్ట్‌ లవ్‌ అందరికీ గుర్తుంటుంది. ఈ పదేళ్లలో ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్‌.  ‘‘రీమేక్‌ మూవీ కోసం రాజుగారు కలుస్తాను అంటే భయపడ్డాను. ఒకవేళ ఆయన్ను కలిస్తే సినిమాకి ఓకే చెప్పేస్తాను. ఆయన బ్యానర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ సినిమా ఒప్పుకున్నాను. ప్రతిరోజూ సెట్లో మ్యాజిక్‌ జరగాలంటే కష్టం. కానీ శర్వానంద్‌ వల్ల ఆ కష్టాన్ని దాటేశాం. నా పర్ఫార్మెన్స్‌కి వచ్చే క్రెడిట్‌ మా ఇద్దరికీ దక్కుతుంది’’ అన్నారు సమంత.

మరిన్ని వార్తలు