-

మూడు రోజుల్లో రూ. 121 కోట్లు వసూలు

21 Dec, 2015 15:20 IST|Sakshi
మూడు రోజుల్లో రూ. 121 కోట్లు వసూలు

ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'దిల్వాలే' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. వసూళ్ల వేటలో మరో బాలీవుడ్ సినిమా 'బాజీరావు మస్తానీ' కంటే ముందంజలో నిలిచింది.

గత శుక్రవారం విడుదలైన రోమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం దిల్వాలే మూడు రోజుల్లో 121 కోట్ల రూపాయలను వసూలు చేసింది. భారత్లో  రూ. 65.02 కోట్లు, విదేశాల్లో రూ. 56 కోట్లు రాబట్టింది. విదేశాల్లో ఈ సినిమాకు అమితాదరణ లభిస్తోందని విశ్లేషకుడు కోమల్ నెహతా చెప్పారు. గల్ఫ్లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రం ఇదేనని తెలిపారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ నటించారు.  

అదే రోజు విడుదలైన హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీకి మూడు రోజుల్లో రూ. 46.77 కోట్లు (భారత్లో) కలెక్షన్లు వచ్చాయి. కాగా ఈ సినిమాకు విదేశాల్లో ఏమేరకు కలెక్షన్ల వచ్చాయన్న విషయం తెలియరాలేదు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపిక పదుకోన్ నటించారు. ఈ రెండు చిత్రాలను వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో నిర్మించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ రానుండటంతో మంచి కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.