వెయ్యి మందినీ  ఒకేసారి రమ్మను

9 Feb, 2019 00:16 IST|Sakshi

‘ఒక్కొక్కడినీ కాదు షేర్‌ఖాన్‌ వందమందినీ ఒకేసారి రమ్మను’ అని ‘మగధీర’లో రామ్‌చరణ్‌ను వంద మందితో ఫైట్‌ చేయించారు రాజమౌళి. వీళ్ల కాంబినేషన్‌లో పదేళ్ల తర్వాత వస్తోన్న  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఈ సంఖ్యను పదింతలు చేశారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో సుమారు 1000 మందికి పైగా ఆర్టిస్టులు పాల్గొంటున్నారట.

ఈ సినిమాలో ఇదే పెద్ద యాక్షన్‌ సీన్‌ అనుకుంటే పొరపాటే. దీనికంటే భారీ యాక్షన్‌ సీన్స్‌ను కూడా ప్లాన్‌ చేశారట దర్శకుడు రాజమౌళి. సెకండ్‌ షెడ్యూల్‌లో బ్రేక్‌ తీసుకుంటున్న ఎన్టీఆర్‌ తర్వాతి షెడ్యూల్‌లో జాయిన్‌ అవుతారట. 1920ల నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారట. ఎన్టీఆర్‌ సరసన పరిణీతీ చోప్రా, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌లను హీరోయిన్లుగా తీసుకోవాలి అనుకుంటున్నారట చిత్రబృందం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌ కుమార్‌. 


 

మరిన్ని వార్తలు