నెక్ట్స్‌ ఎన్‌టీఆరేనా?

23 Sep, 2019 11:51 IST|Sakshi

చెన్నై : కోలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకుడిగా రాణిస్తున్న యువ దర్శకుడు అట్లీ. రాజారాణి చిత్రంలో దర్శకుడిగా తన పయనాన్ని ప్రారంభించిన ఈయన దర్శకుడు శంకర్‌ శిష్యుడన్న విషయం తెలిసిందే. తొలి చిత్రంతో శభాష్‌ అనిపించుకున్న అట్లీ ఆ తరువాత నటుడు విజయ్‌తో వరుసగా తెరి, మెర్శల్, తాజాగా బిగిల్‌ చిత్రాలను చేశారు. తెరి హిట్‌ చిత్రం అయితే మెర్శల్‌ చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిగిల్‌ చిత్రం అంతకు మించి హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. ఇకపోతే దర్శకుడు అట్లీ ఒక చిత్రం పూర్తి చేయగానే నెక్ట్సేంటి? అనే ఆసక్తి రేకెత్తుతుంటుంది.

అలా మెర్శల్‌ తరువాత అట్లీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. అక్కడ ఒక స్టార్‌ హీరోతో చిత్రం చేయనున్నారనే ప్రచారం సాగింది. అయితే అది ప్రచారానికే పరిమితమైంది. ఇప్పుడు బిగిల్‌ చిత్రం పూర్తి కావచ్చింది. ఇప్పుడు నెక్ట్సేంటి? అన్న ప్రశ్నకు మళ్లీ తెలుగులో చిత్రం చేయనున్నాడు అనే ప్రచారం మొదలైంది. అవును ఈయన టాలీవుడ్‌ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్  హీరోగా చిత్రం చేయనున్నారనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అయితే జూనియర్‌ ఎన్టీఆర్కు తమిళంలో నటించాలన్న ఆశ చాలా కాలంగా ఉంది. త్వరలో అది నెరవేరనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా ఆయనతో దర్శకుడు అట్లీ చిత్రం చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం జూనియర్‌  ఎన్టీఆర్  రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. అట్లీ బిగిల్‌ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదల తరువాతనే ఆయన తన తాజా చిత్రం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు