భారతీయుడు.. ఒకే ఒక్కడు... రేంజ్‌లో ఆక్సిజన్‌ – దర్శకుడు జ్యోతికృష్ణ

24 Oct, 2017 00:14 IST|Sakshi

‘‘జ్యోతికృష్ణ చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండా కథలు రాసేవాడు. చదువుకుని ఫారిన్‌లో సెటిలవుతాడనుకుంటే, లండన్‌లో ఫిల్మ్‌ డైరెక్షన్‌ ట్రైనింగ్‌ తీసుకొచ్చాడు. చిన్న వయసులోనే డైరెక్టర్‌ అయ్యాడు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు నిర్మాత ఏయం రత్నం. గోపీచంద్, రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆక్సిజన్‌’. శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జ్యోతికృష్ణ భార్య ఎస్‌. ఐశ్వర్య నిర్మించారు.

యువన్‌శంకర్‌ రాజా స్వరపరచిన ఈ సినిమా పాటలను సోమవారం విడుదల చేశారు. ఏయం రత్నం మాట్లాడుతూ– ‘‘స్వార్థపరుల వల్ల యువత ఎంతగా దెబ్బతింటున్నది అన్నదే ఈ సినిమా కథ. ‘ఆక్సిజన్‌’ మొదలుపెట్టి చాలా కాలం అయింది. ఎప్పుడు పిలిచినా మాకు సహకరించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కి చాలా థ్యాంక్స్‌. తమన్నా, జెనీలియా, త్రిష వంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఈ చిత్రంతో అనూ ఇమ్మాన్యుయేల్‌ని పరిచయం చేయాలనుకున్నాం. ఈ సినిమా రిలీజ్‌ అవ్వకముందే తను పెద్ద స్టార్‌ అయిపోయినందుకు హ్యాపీ.

నాకు తెలియకుండా ఈ సినిమాలో నా కోడలితో (ఐశ్వర్య) పాట పాడించారు. ఆ పాట చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమాతో ఐశ్వర్య  నిర్మాతగా మారారు’’ అన్నారు. గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘ఆక్సిజన్‌’ చేయడానికి ముఖ్య కారణం రత్నంగారు. ఆయన్ని చిన్నప్పటి నుంచి చూశా. చాలా మంది బిజినెస్‌ కోసం సినిమాలు చేస్తారు. నాకు తెలిసి టాలీవుడ్‌లో సినిమాపై ప్యాషన్‌ ఉండే నిర్మాతల్లో రత్నంగారు ఒకరు. నేను కథని నమ్మాను. నా నమ్మకం వమ్ము కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో  మంచి మెసేజ్‌ ఇచ్చాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు.

జ్యోతికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఆక్సిజన్‌ కథ ఫస్ట్‌ ఐశ్వర్యకే చెప్పా. తనకు నచ్చింది. గోపిచంద్‌సార్‌కి ఆరు గంటల్లో రెండు కథలు వినిపించా. ‘ఆక్సిజన్‌’ కథ నచ్చిందని, ఓకే చేశారు. ఈ సినిమాలో ఆయన మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. ఇంటర్వెల్‌ ఫైట్‌లో అద్భుతంగా నటించారు. గోపి నాట్‌ ఏ సినిమా హీరో. రియల్‌ హీరో. నాన్నగారికి సోషల్‌ ఓరియంటెడ్‌ సినిమాలంటే ఇష్టం. ఆయన తీసిన ‘కర్తవ్యం, పెద్దరికం, ఆశయం, భారతీయుడు, ఒకే ఒక్కడు’ రేంజ్‌లో ‘ఆక్సిజన్‌’ ఉంటుంది.

తొలిరోజు సెట్‌లో ఎంత డెడికేషన్, మంచి బిహేవియర్‌తో ఉన్నారో... ఇప్పుడూ అనూ ఇమ్మాన్యుయేల్‌ అలాగే ఉన్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. తెలుగులో నేను సైన్‌ చేసిన తొలి చిత్రమిది. రిలీజ్‌ ఆలస్యం అయింది. నాకు తొలి అవకాశం ఇచ్చిన  రత్నంసార్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమాని ఆశీర్వదించి, పెద్ద హిట్‌ చేయాలి’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్‌. ‘‘చాలామంది నిర్మాతలకి రామానాయుడుగారు రోల్‌ మోడల్‌.

రత్నంగారిని చూసి ఆయనలాగా అవ్వాలని మేం ఇండస్ట్రీకి వచ్చాం. ఒక టెక్నీషియన్‌ ఎంత పెద్ద నిర్మాత అవ్వొచ్చో చూపించారాయన’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్‌. చిత్ర నిర్మాత ఐశ్వర్య, సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌ రాజా, కెమెరామేన్‌ ఛోటా కె. నాయుడు, నిర్మాతలు భోగవల్లి ప్రసాద్, అంబికా కృష్ణ, పోకూరి బాబూరావు, అనీల్‌ సుంకర, మల్కాపురం శివకుమార్, రాజ్‌ కందుకూరి, మిర్యాల రవీందర్‌రెడ్డి, నటులు అలీ, శరత్‌కుమార్, నాజర్, కెమెరామేన్‌ సెంథిల్, డైరెక్టర్‌ నేసన్‌ ,  ఇండియన్‌ ఐడిల్‌ రేవంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు