‘ఆ కథ మాత్రం మనసులోంచి పోలేదు’

19 Jul, 2017 17:09 IST|Sakshi
‘ఆ కథ మాత్రం మనసులోంచి పోలేదు’

తమిళ దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ తన కొత్త సినిమాకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ విషయంపై  దర్శకురాలు మాట్లాడుతూ.. ముంబాయి వెళ్లినప్పుడు  హిందీ చిత్రాన్ని చూశానని ఆ చిత్రం తన మనసులోంచి పోలేదని ఆమె చెప్పారు. అమ్మణి చిత్రం తరువాత తన తాజా చిత్రానికి గత ఏడాది తమిళ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన తుపాన్‌ నేపథ్యంలో ఒక చిత్రం చేయాలని భావించానని అన్నారు.

ఆ చిత్ర నిర్మాతను కలిసి హక్కుల కోసం చర్చించినా, అది సెట్ కాలేదన్నారు. అయితే ఆ కథ మాత్రం తన మనసులోంచి పోలేదన్నారు. దీంతో ఆ సినిమా  స్ఫూర్తితో తానే ఒక కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. ఒక యువ దంపతుల సొంత ఇల్లు కల ఇతివృత్తంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హౌస్ ఓనర్ అనే టైటిల్‌ను  నిర్ణయించిట్లు ఆమె తెలిపారు.

ఏమిటి అసలు విషయం ఏమిటో చెప్పకుండా హౌస్ ఓనర్ అంటున్నారు అని అనుకుంటున్నారా ? ప్రస్తుతం సమాజంలో మధ్య తరగతి కుంటుంబానికి చెందిన చాలామందికి సొంత ఇల్లు కలే. అలాంటి ఒక యువ దంపతుల డ్రీమే హౌస్ ఓనర్. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లక్ష్మీరామకృష్ణన్ చెప్పారు. ఈ చిత్రంలో అశోక్ సెల్వన్ హీరోగా, హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్  నటించనున్నారు.