కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు

9 Aug, 2019 02:31 IST|Sakshi
షకీలా, సంపూర్ణేష్‌ బాబు, సాయి రాజేశ్, రూపక్, సందీప్‌ కిషన్‌

‘‘ఒక వ్యక్తికి సినిమా పట్ల ఎంత ప్యాషన్‌ ఉంటుందో సాయి రాజేష్‌ని చూసి తెలుసుకోవచ్చు. మట్టి నుండి తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని మనం పూజిస్తామో.. అలా మట్టిలో నుంచి సంపూని తెచ్చి ఒక స్టార్‌ని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సంపూ ఎంత పెద్ద నటుడు అనేది ఆల్రెడీ ప్రూవ్‌ అయింది’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. సంపూర్ణేష్‌ బాబు హీరోగా రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. సాయి రాజేష్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘సంపూర్ణేష్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ చూశాక మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథ అనిపించింది. అందుకే ఉదయం 8:45 గంటల ఆటకి టికెట్‌ బుక్‌ చేసుకున్నాను’’ అన్నారు. ‘‘జంధ్యాల, ఈవీవీగార్ల వినోదం తర్వాత సాయిరాజేశ్‌ కామెడీ నాకు నచ్చుతుంది. రాజేష్, సంపూగారివల్లే  ఈ సినిమా చేశాను’’ అన్నారు రూపక్‌ రొనాల్డ్‌ సన్‌. 

‘‘ఈ సినిమా కోసం నేను, సంపు, రూపక్‌.. మా కెరీర్‌లను వదులుకుని మరీ చేశాం. ‘కొబ్బరిమట్ట’ ఐదేళ్లు చేశామని అంటున్నారు, కానీ మేం షూటింగ్‌ చేసింది 39 రోజులు మాత్రమే’’ అన్నారు  సాయి రాజేశ్‌. ‘‘నిజాయతీతో సినిమా చేసిన టీమ్‌ ఇది. తప్పకుండా సినిమా చూడండి’’ అన్నారు హీరో  సందీప్‌ కిషన్‌. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నటి షకీలా. సంపూర్ణేశ్‌ బాబు, నటులు శివ బాలాజీ, సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు