‘సరిలేరు’ తర్వాత మహేశ్‌ చిత్రం ఇదే!

30 Apr, 2020 19:47 IST|Sakshi

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్ ‌బాబు చేసే చిత్రం దాదాపు ఖరారయింది. మహేశ్‌ తన 28 చిత్రాన్ని ‘గీతా గోవిందం’ఫేమ్‌ పరుశురామ్‌కు అప్పగించినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు పరుశురామ్‌ తన తదుపరి చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 

‘ఒక్కడు సినిమా చూసిన తరవాత ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాను. మహేష్ సార్‌తో సినిమా చేయాలనదే నా బలమైన కోరిక. నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.  గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నాను. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. నవరసాలు ఉంటాయి. అభిమానులు మహేశ్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఈ చిత్రం ఉండబోతుంది. నాగ చైతన్యతో తాను కచ్చితంగా సినిమాను తెరకెక్కిస్తాను.. మహేశ్‌ చిత్రం తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది’అని పరుశురామ్‌ వివరించాడు. 

కాగా మహేశ్‌ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి ప్రేమకథతో ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేశ్‌ సరసన ‘మహానటి’ఫేం కీర్తి సురేష్‌ నటించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ ఉపేంద్రను విలన్‌ పాత్ర కోసం చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రం అన్నీ కుదిరితే ఆక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే తన తదుపరి చిత్రం గురించి మహేశ్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

చదవండి:
వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌
‘మా అమ్మ బయోపిక్‌కి అనుమతి లేదు’ ‌


మరిన్ని వార్తలు