విడాకుల బాటలో...

2 Dec, 2014 22:33 IST|Sakshi
విడాకుల బాటలో...

 సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ దంపతులు మనస్పర్థల కారణంగా విడిపోయారు. వివాహ రద్దు కోరుతూ సోమవారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నటి లిజీ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత తాను, ప్రియదర్శన్ విడిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇది ఇద్దరం సమష్టిగా తీసుకున్న నిర్ణయమేనని పేర్కొన్నారు. ఈ విషయం తమ పిల్లలకు, బంధుమిత్రులకు తెలుసని అన్నారు. ఇది ఇలా ఉంటే... తమిళం, తెలుగు, మలయాళం - ఇలా దక్షిణాదిన పలు చిత్రాల్లో లిజీ కథానాయికగా నటించారు.
 
 మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూడా తమిళ, మలయాళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. వీరి వివాహం 1990లో జరిగింది. ఈ దంపతులకు కూతురు కల్యాణి, కొడుకు సిద్ధార్థ్ ఉన్నారు. పిల్లలిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. ప్రియదర్శన్, లిజీల మధ్య ఇంతకుముందు ఒకసారి మనస్పర్థలు తలెత్తి, విడిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే అప్పుడు నటుడు కమలహాసన్, పలువురు సినీ ప్రముఖులు సర్దిచెప్పి పరిస్థితిని విడాకుల వరకు పోకుండా చక్కదిద్దారు. తాజాగా మళ్లీ ప్రియదర్శన్, లిజీల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో వారు విడాకుల బాటలో నడుస్తున్నారు.