రాజేంద్రప్రసాద్‌గారు... ప్లీజ్‌ అవకాశం ఇవ్వండి!

3 Jul, 2017 23:27 IST|Sakshi

– దర్శకుడు పూరి జగన్నాథ్‌


‘‘శమంతకమణి’ చిత్రంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే నలుగురు హీరోలు నేను హీరో అంటే నేను అనుకుని కొట్టుకునే రేంజ్‌లో వారి పాత్రలు ఉంటాయి. ఈ క్రెడిట్‌ దర్శకుడు శ్రీరామ్‌కు దక్కుతుంది’’ అన్నారు సీనియర్‌ నటులు రాజేంద్రప్రసాద్‌. నారా రోహిత్, సందీప్‌ కిషన్, సుధీర్‌ బాబు, ఆదీ సాయికుమార్‌ హీరోలుగా, కైరా దత్, అనన్య, చాందినీ, జెన్నీ హీరోయిన్లుగా ‘భలే మంచి రోజు’ ఫేమ్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘శమంతకమణి’. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కానుంది.

 ఈ సందరభంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్, ఆడియో రిలీజ్‌ నిర్వహించారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ జనరేషన్‌తో పనిచేస్తే ఎలా ఉంటుందో అనుకుని భయపడే నాకు తమ్ముళ్లు, బిడ్డల కన్నా ఎక్కువ నాతో ఫ్రెండ్లీగా ఉండి, పనిచేసిన ఆ నలుగురికీ (హీరోలు) నా కృతజ్ఞతలు. నా మిత్రుడు ఆనంద ప్రసాద్‌గారు ఒక టేస్ట్‌ ఉన్న జెంటిల్‌మన్‌. అన్నే రవి అనే కుడి భుజంతో కలిసి మంచి చిత్రం తీశారు’’ అన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ – ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో పని చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆయన్ను చూసి చాలా నేర్చుకున్నాను. ప్లీజ్‌ సర్‌.. ఏదో ఒక రోజు మీతో పనిచేసే అవకాశం ఇవ్వండి.

 ‘శమంతకమణి’ ఫంక్షన్‌కి వెళదామని రెండు రోజులుగా బాలకృష్ణగారు అంటూనే ఉన్నారు. చిన్న ఫుడ్‌ పాయిజన్‌ అవడం వల్ల చివరి నిమిషంలో ఆయన ఈ ఫంక్షన్‌కి రాలేకపోయారు. ఆయన తరఫున నన్ను సారీ చెప్పమన్నారు. ‘శమంతకమణి’ పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాకి శ్రీరామ్‌ ఆదిత్య హీరో. పూరీగారు బాలయ్య బాబుతో ఎప్పుడు సినిమా చేస్తారా? అనుకునేవాణ్ణి. వారి కాంబినేషన్‌లో వస్తున్న ‘పైసా వసూల్‌’ మరో పది సినిమాలకు సరిపడా పైసలు వసూలు చేయాలి’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘ఈ ఫంక్షన్‌కి బాలయ్యగారు వస్తారనుకున్నా. బ్లాకులో టికెట్టు కొని ఆయన సినిమాలు చూసేవాణ్ణి. ఆయనతో పాటు నేనున్న ఫొటో కూడా పేపర్లో పడుతుందని ఆనందంగా ఇక్కడికి వచ్చా.

కానీ, డిజప్పాయింట్‌మెంట్‌. కచ్చితంగా ఆ రోజు వస్తుంది’’ అని సుధీర్‌బాబు చెప్పారు. ‘‘నలుగురు హీరోలు కలిస్తే ఇంత సరదాగా సినిమా తీయొచ్చని చెప్పడానికి ‘శమంతకమణి’ బెస్ట్‌ ఉదాహరణ. ఆ క్రెడిట్‌ దర్శక–నిర్మాతలదే. చిన్నప్పుటి నుంచి రాజేంద్రప్రసాద్‌గారిని చూస్తూ పెరిగాను. ఆయనతో పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నా’’ అన్నారు సందీప్‌కిషన్‌. ‘‘ఏ హీరోకైనా పూరీతో పని చేయాలనుంటుంది. నాకిష్టమైన దర్శకుడాయన. ఈ చిత్రానికి డైరెక్టరే హీరో’’ అన్నారు ఆది. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘నా డ్రీమ్‌ శమంతకమణి కారు. జాబ్‌ మానేసి ఈ కథ రాసుకునేటప్పుడు నేను డిస్టర్బ్‌ అవ్వకూడదని మా నాన్న ఆరు నెలలు నాకు జీతం ఇచ్చారు. నలుగురు హీరోలతో సినిమా చేయగలననే ధైర్యం మా మమ్మీ ఇచ్చిందే. మా సినిమాలో హీరో, హీరోయిన్లు లేరు. ఇంట్రెస్టింగ్‌ పాత్రలే ఉంటాయి’’ అన్నారు. నిర్మాత వి. ఆనంద ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే రవి, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.