సినిమా బాగుందని రాజమౌళిగారు అభినందించారు

27 Dec, 2019 00:21 IST|Sakshi
రితేష్‌ రానా

‘‘మత్తు వదలరా’ కథకు పాటలు, ఫైట్స్‌ అవసరం లేదనిపించింది. పాటలనేవి కథను ముందుకు నడిపిస్తేనే ఉండాలని నా ఫీలింగ్‌.. ఈ సినిమాలో ఆ అవకాశం లేదు. అందుకే పాటలు పెట్టలేదు. ఈ కథకు ప్రేమ సన్నివేశాలు కూడా అవసరం లేదనిపించింది.. అందుకే లవ్‌ స్టోరీని కూడా టచ్‌ చేయలేదు’’ అని రితేష్‌ రానా అన్నారు. ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా, ఇంకో కుమారుడు కాలభైర సంగీతదర్శకుడిగా పరిచయమైన చిత్రం  ‘మత్తు వదలరా’.

‘వెన్నెల’ కిశోర్, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా బుధవారం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్‌ రానా మాట్లాడుతూ– ‘‘నాది హైదరాబాద్‌. కాలేజీ డేస్‌ నుంచే డైరెక్షన్‌పై ఆసక్తి ఉంది. మా టీమ్‌తో కలిసి పదేళ్ల నుంచి నేను షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నాను. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా చెర్రీగారిని కలిసే అవకాశం వచ్చింది. కథ ఆయనకు నచ్చడంతో మా జర్నీ మొదలైంది. శ్రీసింహా తన బ్యాగ్రౌండ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా కష్టపడి సినిమా చేశాడు. కాలభైరవ మంచి నేపథ్య సంగీతం ఇచ్చాడు.

కీరవాణిగారి కుటుంబ సభ్యులెవరూ ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేదు. మా సినిమాని ప్రేక్షుకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. రివ్యూస్‌ కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. మరికొన్ని థియేటర్స్‌ పెరగాల్సి ఉంది. దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాసుకున్న కథను బాగా తీయాలనే ఆలోచనతోనే కష్టపడ్డా. అయినా సినిమా బాగుంటే ప్రేక్షకులే చూస్తారు. నేను చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్‌. అందుకే ఆయన పాత సినిమాలను గుర్తు చేస్తూ స్క్రీన్‌ప్లే రాసుకున్నాను.. మంచి స్పందన వస్తోంది. డైరెక్టర్‌ రాజమౌళిగారు మా సినిమాని మూడుసార్లు చూశారు. మంచి సినిమా చేశారని అభినందించారు. ప్రస్తుతం నా దగ్గర రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.  

మరిన్ని వార్తలు