నిర్మాత దర్శకుడినెప్పుడూ మెచ్చుకోడు

21 Jun, 2014 01:19 IST|Sakshi

చిత్ర నిర్మాత ఎప్పుడూ మెచ్చుకోరని యువ దర్శకుడు జయం రాజా వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం కార్తికేయన్. కలర్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎం.చందు దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీత బాణీలందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ నిర్మాత తండ్రి అయినా ఆ చిత్ర దర్శకుడిని మెచ్చుకునే ప్రశ్నే ఉండదన్నారు.

చిత్ర బడ్జెట్ పెంచావ్, నిర్మాణంలో జాప్యం అయ్యింది వంటి విమర్శలు దర్శకుడు భరించాల్సిందేనని చెప్పారు. అలాంటిది ఈ కార్తికేయన్ చిత్ర నిర్మాత, దర్శకుడిని అభినందించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. చిత్ర హీరో నిఖిల్ తెలుగులో పది చిత్రాలకు పైగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, హీరోయిన్ స్వాతి తమిళ పరిశ్రమకు సుపరిచితురాలని పేర్కొన్నారు. తన తొలి చిత్రం జయంలో కార్తికేయన్ వేలాయుధం ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇప్పుడీ చిత్రమే కార్తికేయన్ పేరుతో రూపొందుతోందని మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు జయంరాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటి తులసి, స్వాతి, నిఖిల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.