నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది

22 Nov, 2019 00:17 IST|Sakshi
ముస్కాన్‌ సేథీ, శ్రీరామ్, సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌ కానూరి

– శ్రీనివాస్‌ రెడ్డి

ఈషా రెబ్బా లీడ్‌ రోల్‌లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్‌ సేథీ, గణేశ్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కానూరి శ్రీనివాస్‌ నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా  హిట్‌ కొట్టి సక్సెస్‌ఫుల్‌ దర్శకుడిగా వెలుగొందుతాననే నమ్మకం ఉంది.

నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. నా పక్కనే నిలబడి నన్ను నడిపించారు నిర్మాత కానూరి శ్రీనివాస్‌. బతికున్నంత కాలం అతన్ని వదలను. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనుష్క, కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్‌ కథ విన్నా డేట్స్‌ కుదరక చేయలేదు. తెలుగందం ఈషారెబ్బాతో పని చేశామని గర్వంగా చెబుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డిగారు అద్భుతమైన సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్‌ కానూరి.  ‘‘కథ విన్న తర్వాత ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను.

అద్భుతమైన కథ. మంచి పాత్రలను డిజైన్‌ చేశారు శ్రీనివాస్‌రెడ్డిగారు’’ అన్నారు సత్యదేవ్‌. ‘‘తెలుగు అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు రావాలంటే అదృష్టం కావాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. శ్రీనివాస్‌ రెడ్డిలాంటి దర్శకులు ఉండబట్టే మేం ఇండస్ట్రీలో ఉన్నాం. శ్రీనివాసరెడ్డిగారు చాలా కూల్‌. సత్యదేవ్‌ మన తెలుగు విక్కీకౌశల్‌.  ఇలాంటి టీమ్‌తో పని చేయడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీరామ్, ముస్కాన్‌ సేథీ, గణేశ్‌ వెంకట్రామన్, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు