తండ్రి కల నెరవేర్చడం కోసం..

2 Jul, 2018 08:21 IST|Sakshi
దర్శకుడి సైకిల్‌ యాత్రకు జెండా ఊపుతున్న దృశ్యం

తమిళసినిమా: సాధారణంగా పిల్లల కలలను నెరవేర్చడానికి తలిదండ్రులు త్యాగాలకు సిద్ధపడుతుంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి చిరకాలంగా నెరవేరని తన తండ్రి కలను సాకారం చేయడానికి నడుం బిగించారు. ఆయనే దర్శకుడు సుబ్బరాజ్‌. ఈయన సినిమాల్లో నటించాలన్న తన తండ్రి చిరకాల కోరికను నెరవేర్చడానికి తానే దర్శక నిర్మాతగా మారారు. అలా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం అరళి. పిల్లలు ప్రయోజకులు కావడానికి, పక్కదారి పట్టడానికి తల్లిదండ్రులే కారణం అనే ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధానపాత్రను దర్శక నిర్మాత సుబ్బరాజ్‌ తండ్రి అరుణాచలం నటిస్తున్నారు. ఆయనతో పాటు సుబ్బరాజ్‌ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రంలో మధుసూధన్, మంజులా రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.

కాళీదాస్, అమృతలింగం,కోవైసెంధిల్, సైకిల్‌మణి,రాజ్‌కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. మరో విశేషం ఏమిటంటే సుబ్బరాజ్‌ తల్లిదండ్రులను స్మరించాలి అన్న స్లోగన్‌తో చెన్నై నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్‌ ర్యాలీ తలపెట్టారు. శనివారం సాయంత్రం స్థానికి టీ.నగర్‌లోని ఎంఎం ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించిన అరళి చిత్ర విలేకరుల సమావేశంలో అతిథులుగా నటుడు రాధారవి, నిర్మాత ఎడిటర్‌ మోహన్, జాగ్వుర్‌తంగం తదితరులు పాల్గొన్నారు. సుబ్బరాజ్‌కు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమాభిమానాలు చూసి నటుడు రాధారవి త్వరలో చిత్రం నిర్మించనున్నానని, దానికి సుబ్బరాజ్‌కు దర్శకుడిగా అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా తల్లిదండ్రులను స్మరించాలి అన్న స్లోగన్‌తో  సైకిల్‌ యాత్ర చేపట్టిన సుబ్బరాజ్‌కు అతిథులు జెండా ఊపి సాగనంపారు.

>
మరిన్ని వార్తలు