అతడి కోసం నటులుగా మారిన దర్శకులు

19 Jun, 2019 19:13 IST|Sakshi

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్, కథానాయిక మాళవిక నాయర్ నటించారు. వీరు ముగ్గురు సందీప్ కిష‌న్‌కి మంచి మిత్రులు.

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'టైగర్' చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ 'డిస్కో రాజా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, సందీప్ కిషన్ నటించిన ఓ తమిళ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ తమిళ సినిమా తెలుగులో 'డి 16' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. వీరిద్దరూ సందీప్ కిషన్ అడగ్గానే ఆయన కోసం అతిథి పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రీరికార్డింగ్ చేస్తున్నారు. 

ఇటీవలే నీరజ కోన రాసిన టైటిల్ సాంగ్‌ ‘నిను వీడని నీడను నేనే' విడుదలచేశారు. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే, ఈ సినిమాలో ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్ 'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి ...'ను హీరో సిద్ధార్థ్ పాడారు. త్వరలో ఈ పాట కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో  పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు