ఇంకా ఏమీ జరగలేదు!

5 Jan, 2018 18:52 IST|Sakshi

నటి దిశాపఠాని ఇంకా నిర్ణయం జరగలేదు అంటోంది. ఏమిటా నిర్ణయం అన్నది తెలుసుకోవాలనుందా? ఎంఎస్‌.ధోని అన్‌టోల్డ్‌ స్టోరి చిత్రంతో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన ఈ ఉత్తరాది  దిశాపఠాని.  అయితే బీటెక్‌ చదివిన ఈ అమ్మాయి చాలా మంది బ్యూటీస్‌ లాగానే మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకుంది. క్యాడ్‌బరీ వాణిజ్య ప్రకటన ద్వారా ప్రాచుర్యం పొందిన దిశాపఠానిపై మొట్టమొదట దృష్టి పడింది టాలీవుడ్‌ దర్శకుడు పూరిజగన్నాథ్‌దే. అంతే లోఫర్‌ చిత్రంలో హీరోయిన్‌ అయ్యిపోయింది. ఆ తరువాతే హిందీలో ఎంఎస్‌.ధోని అన్‌టోల్డ్‌ స్టోరి చిత్రంతో బాలీవుడ్‌ తెరపై మెరిసింది. 

తాజాగా కోలీవుడ్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్‌లో బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర చిత్రం తెరరూపానికి చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మెర్శల్‌ వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ ఈ చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందించనుంది. సుందర్‌.సీ దర్శకత్వం వహించనున్న ఇందులో జయం రవి, ఆర్య కథానాయకులుగా సెట్‌ అయ్యారు. కథానాయకిగా శ్రుతిహాసన్‌ ముందు ఓకే అన్నా, ఆ తరువాత అనూహ్యంగా వైదొలగి పెద్ద వివాదానికే కారణమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె పాత్రలో నటించడానికి నయనతార, హన్సికల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వారూ సెట్‌ కాలేదు. 

చివరికి బాలీవుడ్‌ చిన్నది దిశాపఠాని ఎంపికైనట్లు ప్రచారం హోరెత్తింది. ఈ సంచలన చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. దర్శకుడు సుందర్‌.సీ సంఘమిత్ర చిత్రం అనుకున్న తరువాత కలగలప్పు 2 చిత్రాన్ని పూర్తి చేసేశారు. ఆ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక జయం రవి ‘టిక్‌ టిక్‌ టిక్‌’  చిత్రాన్ని పూర్తి చేసి అదంగమణు చిత్రానికి రెడీ అయిపోయారు. ఆర్య కూడా గజనికాంత్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి దిశాపఠాని కూడా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంఘమిత్ర చిత్రంలో నటించే విషయం గురించి ఆ చిత్ర యూనిట్‌ వర్గాలు చర్చించారు కానీ ఇంకా అందులో నటించే విషయంలో తుది నిర్ణయం జరగలేదని పేర్కొంది. అంటే సంఘమిత్రలో దిశాపఠాని నటించే విషయంలో కూడా క్లారిటీ లేదన్నమాట.

మరిన్ని వార్తలు