మూడు నెలల్లో కదన రంగంలోకి

4 Apr, 2018 00:17 IST|Sakshi

కదన రంగంలోకి కాలు పెట్టనున్నారు దిశా పాట్నీ. జులై నుంచి ఈ గ్లామర్‌ గాళ్‌ గుర్రపు స్వారీ చేస్తూ, కత్తి తిప్పనున్నారట. ఇదంతా ఎందుకంటే ‘సంఘమిత్ర’ సినిమా కోసం. ఇందులో వారియర్‌ క్వీన్‌గా కనిపించటం కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు దిశా పాట్నీ. సుందర్‌.సి దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రం ‘సంఘ మిత్ర’. శ్రీ తేనాండాళ్‌ ఫిల్మ్‌ బ్యానర్‌పై మురళీ రామస్వామి, ఎన్‌. రామస్వామి నిర్మించనున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. హైదరాబాద్‌లో రూపొందించే భారీ సెట్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ని స్టార్ట్‌ చేయనున్నారట. ఈ పీరియాడిక్‌ డ్రామాలో ముందు హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ని అనుకున్నారు.

ఆ తర్వాత ఆమె స్థానంలోకి దిశా పాట్నీ వచ్చారు.  రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి నుంచే మొదలు కావాల్సిన  ఈ షూట్‌ దిశా పాట్నీ ‘భాగీ 2’లో బిజీగా ఉండటంతో జులైకి పోస్ట్‌పోన్‌ అయిందని భోగట్టా. ఫస్ట్‌ పార్ట్‌ని వచ్చే సంవత్సరంలో రిలీజ్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారట దర్శకుడు సుందర్‌. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. కెమెరా: అశీమ్‌ మిశ్రా. 

మరిన్ని వార్తలు