అద్దె కట్టలేని పరిస్థితి వచ్చింది: హీరోయిన్‌

2 Apr, 2018 10:35 IST|Sakshi
దిశా పఠానీ

బాలీవుడ్‌లో ప్రస్తుతం భాగీ 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో భాగీ 2 సినిమా మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేస్తోంది. యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో అడివి శేష్‌ నటించిన క్షణం సినిమాకు రీమేక్‌. భాగీ 2 చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌, దిశా పఠానీ జంటగా నటించారు. సినిమా విజయవంతం కావడంతో దిశా పఠానీ మీడియా ముందుకు వచ్చి తన ఆనందాన్ని పంచుకుంది.

మీడియాతో మాట్లాడుతూ... ‘నేను బ్యాక్‌గ్రౌండ్‌తో రాలేదు. నాకు నటన అంటే చాలా ఇష్టం. నేను మొదటిసారిగా ముంబైకి వచ్చినప్పుడు నా చేతిలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లాను. ఒకనాకొ సమయంలో ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి కూడా వచ్చింది. ఒక అమ్మాయి.. ఎవరూ తెలియని నగరానికి వచ్చి బతకడం ఎంతో కష్టం’ అంటూ తన జ్ఞాపకాలను పంచుకుంది.

‘నేను కష్టాల నుంచే ఎన్నో నేర్చుకున్నాను. నాకు ఈ రంగం కొత్త. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్నేహితులు కూడా ఉండేవారు కాదు. నటన, ఇల్లు, నిద్ర ఇవి తప్ప నాకు వేరే ఆలోచనే ఉండేది కాదు. నేను ఒక సినిమాకు ఒప్పుకున్నాను. తర్వాత అనూహ్యంగా నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. ఇది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన విషయం. అప్పటి నుంచి పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాను. బాధల్లోంచే  ఎంతో నేర్చుకున్నాను’ అంటూ దిశా తన మనసులోని మాటలను తెలిపింది.

భాగీ 2 సినిమా సక్సెస్‌లో మీకు భాగస్వామ్యం ఇవ్వడం లేదని కోపంగా ఉన్నారట అన్న ప్రశ్నకు బదులిస్తూ...‘ఇలాంటి రూమర్స్‌ ఎవరు పుట్టిస్తారో తెలియదు. నేను, టైగర్‌ష్రాఫ్‌తో కలిసి అన్ని ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నాకు అలాంటి ఫీలింగ్‌ లేద’ని చెప్పింది. ఈ భామ ఎం.ఎస్‌.ధోని, లోఫర్‌ సినిమాల్లో మెరిసింది.

మరిన్ని వార్తలు