సిద్ధార్థతో దివ్యాన్షా రొమాన్స్‌

15 May, 2018 08:32 IST|Sakshi

తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్‌ ఆ మధ్య అపజయాలతో వెనుకపడడంతో ఆలోచనలో పడ్డారు. కాస్త గ్యాప్‌ తీసుకుని ‘అవళ్‌’అంటూ హారర్‌ చిత్రాన్ని నమ్ముకుని సక్సెస్‌ అయ్యారు. ఇకపై తప్పటడుగు వేయరాదంటూ చిత్రాల ఎంపికలో జాగ్రత్త పడుతున్న ఈ యువనటుడు ప్రస్తుతం కప్పల్‌ చిత్రం ఫేమ్‌ కార్తీక్‌ జీ.క్రిష్‌ దర్శకత్వంలో ‘సైతాన్‌ కీ బచ్చా’చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాకముందే అదే దర్శకుడితో మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ చిత్రం కూడా షూటింగ్‌ జరుపుకుంటోందట. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ మోడల్‌ దివ్యాన్షా కౌషిక్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ విషయాన్ని ఈ అమ్మడే చెప్పింది. తాను ఇటీవలే నిర్మాత సుధన్‌ను కలిశానని, ఆయన నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకిగా ఎంపిక కావడానికి ఆడిషన్, ఫోటో షూట్‌లో కూడా పాల్గొన్నానని చెప్పింది. అంతే కాదు చిత్ర షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నానని ఇందులో నటిండం చాలా ఫన్‌గా ఉందని అంది.

ఈ చిత్రంలో చాలా మోడరన్‌ లుక్‌లో కనిసించే అనార్థోడాక్స్‌ యువతి పాత్రలో నటిస్తున్నానని, ఇంతకంటేఎక్కువ పాత్ర గురించి చెప్పకూడదని పేర్కొంది. అయితే ఈ పాత్ర తన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉందనిపిస్తోందని చెప్పింది. తమిళ చిత్రంలో నటించడానికి తనకు భాష సమస్య అనిపించడం లేదంది. ఎందుకంటే మూడు నాలుగు రోజుల ముందే చిత్ర స్క్రిప్ట్‌ను తెప్పించుకుని ప్రిపేర్‌ అవుతున్నట్లు చెప్పింది. చిత్ర టీం కూడా ఆడియో క్లిప్పింగ్స్‌ పంపుతున్నారని, కాబట్టి తమిళం సంభాషణలు ఉచ్చరించడం తనకేమంత కష్టం అనిపించడం లేదంది. దర్శకుడు కార్తీక్‌ జీ.క్రిష్, నటుడు సిద్ధార్థ తనకు కావలసిని సమయాన్ని ఇస్తున్నారని, అందువల్ల తనకు ఇంటి వద్ద ఉన్న ఫీలింగే కలుగుతోందని దివ్యాన్షా కౌశిక్‌ చెప్పుకొచ్చింది. చూద్దాం ఈ అమ్మడి టైమ్‌ ఇక్కడ ఎలా ఉంటుందో!

మరిన్ని వార్తలు